CM Revanth Reddy: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరుగుతున్న సీడబ్ల్యూసీ (CWC Meet) విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ వాగ్దానం మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్న రేవంత్.. రాష్ట్రంలో పది నెలల్లోనే 25 లక్షల కుటుంబాలకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. అలాగే తెలంగాణలో కులగణన చేసి దేశానికి చూపించినట్లు రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని (Central Govt) టార్గెట్ చేసిన రేవంత్.. కాషాయ దళంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రధాని మోదీపై ఫైర్
గాడ్సే ఆలోచన విధానాన్ని దేశంలో వ్యాపింపజేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రయత్నిస్తున్నారని రేవంత్ అన్నారు. గాడ్సే (Godse) వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకునేందుకు గాంధీ కుటుంబ సభ్యులైన రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో పాటు దేశంలోని ప్రతి ఒక్కరూ ఏకంగా కావాల్సిన అవసరముందని చెప్పారు. ప్రధాని మోదీ.. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చారన్న రేవంత్.. వాటికి నిరసనగా రైతులు 14-15 నెలలు పోరాడిన విషయాన్ని గుర్తుచేశారు. మణిపూర్ (Manipur Issue)లో మంటలు రాజేశారన్న సీఎం.. అక్కడి హక్కులను ప్రధాని కాలరాసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
వాగ్దానాలు నెరవేర్చాం
భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా తెలంగాణకు రాహుల్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలకు పలు హామీలు ఇచ్చినట్లు రేవంత్ గుర్తు చేశారు. కుల గణన, రైతు రుణ మాఫీ, యువతకు ఉద్యోగాల కల్పన, మహిళల సంక్షేమంపై ఆయన వాగ్దానాలు చేశారన్నారు. వాటిని నెరవేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మరోవైపు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని.. గుర్తు చేశారు. కానీ మోదీ, అమిత్ షా (Amit Shah) ఇద్దరికే ఉద్యోగాలు వచ్చాయని సైటైర్లు వేశారు.
బీజేపీకి నో ఛాన్స్
తెలంగాణలో బీజేపీ (Telangana BJP) కి అవకాశం ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి.. గుజరాత్ వేదికగా స్పష్టం చేశారు. తమకు నిజాం (Nizam)ల నుంచి స్వాతంత్రం కల్పించిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) అంటే తెలంగాణ ప్రజలకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. ‘వల్లభాయ్ పటేల్ పుట్టిన గుజరాత్ నేల నుంచి నేను ఒకటే చెబుతున్నా. సోనియా గాంధీ నాయకత్వంలో మేం బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం. బీజేపీని అడ్డుకుంటాం. వారిని ఎవరూ క్షమించరు’ అని రేవంత్ అన్నారు.
Also Read: Passport Seva Mobile Van: గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే పాస్ పోర్ట్.. స్పెషల్ వెహికల్ రెడీ
ఆంగ్లేయుల కంటే ప్రమాదం
బ్రిటిషర్ల కంటే బీజేపీ నాయకులు ప్రమాదకారులని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బ్రిటిషర్లను దేశం నుంచి తరిమికొట్టినట్లే రాహుల్ గాంధీ నాయకత్వంలో మనమంతా బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని సీడబ్ల్యూసీ వేదికగా పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యత ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త, గాంధీ వారసులు ఈ సమావేశం ద్వారా తీసుకొని వెళ్లాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.