Bird Flu case: తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలవరం.. మరోమారు మెుదలైంది. తాజాగా సిద్దిపేట జిల్లా (Siddipet District) తొగుట మండలం కాన్గల్ లో బర్డ్ ఫ్లూ కేసు (Bird Flu Case) నమోదు కావడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ (Garima Agrawal) అప్రమత్తం అయ్యారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పోలీసు పికెటింగ్
సిద్దిపేట జిల్లా కాన్గల్ గ్రామంలోని మైనర్ లేయర్ కోళ్ల ఫామ్ లో ఈ H5N1 ఏవియర్ ఇన్ఫ్లుంజా (H5N1 Avian Influenza) వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్.. పశుసంవర్ధక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ వ్యాధి విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు కాన్గల్ గ్రామ శివారులో పోలీసు పికెటింగ్ ను సైతం ఏర్పాటు చేశారు. వైరస్ సోకిన కోళ్లను చికెన్ షాపులకు (Chicken Shops) తరలించకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
‘కోళ్లను చంపేయండి’
బర్డ్ ఫ్లూ బయటపడిన మైనర్ లేయర్ కోళ్ల ఫామ్ లోని సిబ్బందికి వైద్యులు పరీక్షలు చేశారు. అంతేకాదు ఆ ఫామ్ కు కిలోమీటర్ల పరిధిలో ఏవైనా కోళ్ల ఫారాలు ఉంటే ఆ కోళ్లను కూడా చంపేయాలని పశుసంవర్ధక శాక అధికారులు పిలుపునిచ్చారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్ లోని కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో పూడ్చి వేయాలని సూచించారు. ఏవైనా అనుమానాలు ఉంటే కంట్రోల్ రూం నంబర్ 85004 04016 కి కాల్ చేయాలని అధికారులు సూచించారు.
Also Read: TG Summer Holidays: తెలంగాణలో ముందే సెలవులు? ఇక బడి గంటకు విరామం?
అలా చేస్తే సమస్య లేదు!
74 డిగ్రీల సెంటిగ్రేడ్ లో కోళ్ల మాంసాన్ని కానీ గుడ్ల (Eggs)ను కానీ ఉడికిస్తే వైరస్ బ్రతకదని అధికారులు చెబుతున్నారు. సహజంగా మన దేశంలో 120 డిగ్రీల సెంటిగ్రేడ్ లో మాంసాన్ని ఉడికించి తీసుకుంటాం. కాబట్టి ప్రజలకు ఎలాంటి అపాయం లేదని ఎటువంటి ఆందోళన చెందవద్దని అధికారులు సూచిస్తున్నారు.