హైదరాబాద్ స్వేచ్చ: Secretariat: కొత్త సచివాలయానికి రిపేర్లు కొనసాగుతున్నాయి. గత సమస్యలకు తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరి కొన్నిచోట్ల ఇబ్బందులను సిబ్బంది గుర్తించారు. ప్రధానంగా ఒక్కో ఫ్లోర్ ఎలివేషన్ మోడల్ లో భాగంగా ఏర్పాటు చేసిన డిజైన్లలో లోపాలు కనిపిస్తున్నట్లు సమాచారం. దీంతో ఓ భారీ క్రేన్ సహాయంతో సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు. ఇటీవల ఐదో ఫ్లోర్ ఎలివేషన్ నుంచి కాంక్రీట్ పలకలు ఊడిపడటంతో అందరూ ఉలిక్కి పడ్డారు.
దీంతో ఉద్యోగులతో పాటు, వచ్చీ పోయే సందర్శకులు కూడా బిక్కు బిక్కు మంటున్నారు. సచివాలయంలోకి రాగానే నేల చూపులు చూడకుండా ఎందుకైనా మంచిదని పైపైకే చూసి అడుగులేస్తున్నారు. నిర్మాణం పూర్తి అయి రెండేళ్లు కాకముందే వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ కంపెనీ ప్రతినిధులతో ఓ కమిటీని నియమించింది. ఇంకా ఎక్కడెక్కడ లోపాలున్నాయో వెతికి తగిన జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరించింది. ఎలాంటి సంఘటన జరిగినా నిర్మాణ కంపెనీదే బాధ్యత అని కూడా అధికారులు తెలిపినట్లు సమాచారం.
Also Read: BRS Party: బీఆర్ఎస్ తో టచ్ లో ఆ ఎమ్మెల్యేలు? కేసీఆర్ ఓకే చెప్పేనా?
ఎందుకైనా మంచిదని సెక్రటేరియట్ లోపల ప్రధాన పోర్టికో ముందే ఓ భారీ మొబైల్ క్రేన్ ను కూడా ప్రభుత్వం మోహరించింది. రిపేర్లకు వీలుగా ఏరియల్ వర్క్ ప్లాట్ ఫార్మ్ అమర్చిన ప్రత్యేక ట్రక్ ను అందుబాటులో ఉంచారు. ఈ మధ్య ఎలివేషన్ నుంచి పలకలు పడిపోయినప్పుడు కూడా రాత్రికి రాత్రి ఈ వాహనాన్ని తెప్పించి రిపేర్లు చేశారు. అత్యంత పటిష్టంగా ఉండాల్సిన ఎలివేషన్ డిజైన్లకు గాల్వనైజ్డ్ రీ ఇన్ఫోఫోర్స్డ్ కాంక్రీట్ పలకలు వాడారని, అదికూడా నట్లు, బోల్టులతో బిగించటం వల్ల వానకు తడిసి, ఎండకు ఎండి అవిబలహీన పడటంతో పడిపోతున్నాయని అధికారులు అంటున్నారు.
గత రెండు మూడు రోజులుగా ఈ మరమ్మతుల పనులను వేగవంతం చేశారు. పాడైన చోటు రిపేర్లుతో పాటు అన్ని ఫ్లోర్లలో ఎలివేషన్ ను చెక్ చేస్తున్నారు. లీక్ లు ఉన్నచోట ప్రత్యేక కెమికల్ తో ప్రూఫింగ్ కూడా చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. సచివాలయం భవనం స్ట్రక్చర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదనీ, వేగంగా పనులు చేయటం, ఎలివేషన్ డిజైన్ లోపాలను ముందుగా పసిగట్టలేకపోవటం వల్ల సమస్యలు వస్తున్నాయిని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం భారీ క్రేన్ సహాయంతో నిపుణులైన పనివాళ్లను పంపి మరమ్మత్తులు చేస్తున్నామని, వర్షాకాలంలోపు ఈ పనులను పూర్తి చేయటం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/