Chief Information Commissioner: స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్తో పాటు సహచర కమిషనర్ల నియామకాన్ని ఖరారు చేసేందుకు త్రిసభ్య కమిటీ శనివారం సమావేశం కానున్నది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ సచివాలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు సమావేశమయ్యేలా షెడ్యూలు ఖరారైంది.
స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గడువు గతేడాది ఫిబ్రవరి చివరి వారంలోనే పూర్తయింది. ఆ స్థానంలో కొత్త కమిషన్ కొలువుదీరాల్సి ఉన్నది. కానీ వివిధ కారణాలతో తరచూ వాయిదా పడుతూ వచ్చింది. జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నది. మరింత ఆలస్యం కాకుండా తొందరగా కమిషన్ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పదవీకాలం ఈ నెల చివరితో ముగుస్తున్నందున ఆ లోపే ఆమెను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమించే అవకాశం ఉన్నట్లు గత కొన్ని వారాలుగా సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం కూడా ఆమెకే అవకాశం ఇవ్వొచ్చనే మాటలూ వినిపించాయి.
Also read: BRS Party: బీఆర్ఎస్ తో టచ్ లో ఆ ఎమ్మెల్యేలు? కేసీఆర్ ఓకే చెప్పేనా?
ఇదే సమయంలో సీఎంఓలో పనిచేస్తున్న ఓ ఏఐఎస్ (అఖిల భారత సర్వీసు) అధికారి కూడా ఒకరు ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు సెక్రెటేరియట్ కారిడార్లలో చర్చ జరుగుతున్నది. చివరకు ఈ కమిటీ ఎవరిని ఫైనల్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత కొత్త సీఎస్గా ఎవరు వస్తారనే చర్చ జరుగుతున్న సమయంలోనే శాంతికుమారికి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పోస్టు ఇవ్వొచ్చనేది కూడా జరగడం గమనార్హం.
కమిటీలో ముగ్గురు సభ్యులు ఉన్నప్పటికీ ‘కోరం’గా ఇద్దరు హాజరైనా నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనే చర్చ జరుగుతున్న సమయంలో ‘కోరం’ అంశం ప్రస్తావనకు రావడం గమనార్హం. సభ్యులుగా పలువురు జర్నలిస్టులు, న్యాయవాదులు, రిటైర్డ్ ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అర్హమైనవాటి ఎంపిక తదితరాలు పూర్తయ్యాయి. దాదాపు ఏడాది దాటిన తర్వాత స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏర్పాటు తుది ఘట్టానికి చేరుకున్నది.