BRS Party: బీఆర్ఎస్ పార్టీపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఆ పది మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను సంప్రదిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తాను మాత్రం వారిపట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. పార్టీ రజతోత్సవ సభపై ఎర్రవల్లి ఫాం హౌజ్ లో శుక్రవారం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాజకీయంగా నైతిక విలువలు పాటిస్తూ ప్రజలతో మమేకం కావాలన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డదారిలో ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందన్నారు. సభ సక్సెస్ బాధ్యత పార్టీ నేతలపై ఉందన్నారు. స్థానిక సంస్థలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు.
Also read: Telangana: తెలంగాణలో జాబ్స్.. నెలకు రూ. 33,800 జీతం.. అప్లై చేశారా?
ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు సబిత ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు షంభీపూర్ రాజు, నవీన్ రావు, వాణి దేవి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే లు, మాధవరం కృష్ణ రావు, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మా రెడ్డి, డి.సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, డా. మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆశన్న, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పటోళ్ల కార్తీక్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి, జయసింహ, మన్నె క్రిశాంక్, గజ్జెల నగేష్, నివేదిత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.