తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : Airport In Adilabad: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. ఇటీవల మామునూర్ ఎయిర్ పోర్టుకు అనుమతులు సాధించగా.. తాజాగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు భారత ఎయిర్ ఫోర్స్ నుంచి అనుమతులు సాధించడంపై బుధవారం ఒక ప్రకటనలో ఆయన హర్షం వ్యక్తంచేశారు.
6 నెలల స్వల్పవ్యవధిలోనే రెండు ఎయిర్ పోర్టులకు అనుమతులు సాధించడం.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమని కొనియాడారు. అదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, పౌరవిమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రానికి లేఖ రాశామని, దీనికి స్పందించిన భారత వాయుసేన అధికారులు ఏర్పాటుకు సముఖత వ్యక్తంచేయడంతో పాటు.. ఆదిలాబాద్ లో భవిష్యత్తులో వాయుసేన శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు లేఖలో తెలిపారని కోమటిరెడ్డి తెలిపారు.
Also read: Congress on Sand Mafia: ఇసుక దోపిడీకి కళ్లెం.. కొత్త విధానంతో వ్యాపారుల విలవిల..
అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వానికి పౌర విమాన సేవలను ప్రారంభించేందుకు కావాల్సిన అనుమతులు మంజూరుచేస్తున్నట్లు వాయుసేన అధికారులు లేఖ ద్వారా తెలిపినట్టు ఆయన వివరించారు. ఈ విమానాశ్రయాన్ని పౌర విమానయానానికి, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ గా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించినట్టు మంత్రి తెలిపారు.
Also read: YCP YS Jagan: గట్టిగా నిలబడతా.. 2.0 ఏంటో చూపిస్తా.. జగన్ వార్నింగ్
పౌర విమానాల రాకపోకలకు అనువుగా రన్వే పునర్నిర్మాణం చేయడం, పౌర టర్మినల్ ఏర్పాటు, ఎయిర్క్రాఫ్ట్ ఎప్రాన్ (విమానాలు నిల్చోవడానికి, మలుపులు తిరగడానికి, ఇతర విమానయాన కార్యకలాపాలకు ఉపయోగించే నిర్దిష్ట ప్రాంతం) వంటి ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయడం వంటి పనులు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇందుకు అవసరమైన భూమిని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సమకూర్చుకోవాలని వాయుసేన అధికారులు లేఖలో సూచించినట్టు మంత్రి తెలియజేశారు.
అలాగే ఎయిర్ పోర్ట్ కు అవసరమైన అన్ని అనుమతులు పొందేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డీటెయిల్డ్ ప్రపోజల్స్ ను భారత వాయుసేనకు సమర్పించాలని కోరారని, అందుకు సంబంధించిన తదుపరి కార్యాచరణను అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు. అతి త్వరలోనే అన్ని వివరాలతో కూడిన నివేదికను రూపొందించి కేంద్రానికి, సంబంధిత విభాగాలకు సమర్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.