తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Chain Snatcher Arrested: రద్దీగా ఉన్న బస్సుల్లో తిరుగుతూ మహిళల మెడల నుంచి బంగారు గొలుసులు తెంచుకుని ఉడాయిస్తున్న పాతనేరస్తున్ని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు హుమాయున్ నగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి లక్షా 70వేల రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మహిళ ఈనెల 29న బస్సులో మెహదీపట్నం వచ్చింది. స్టాపులో బస్సు దిగుతుండగా అగంతకుడు ఆమె మెడలోని రెండు తులాల మంగళసూత్రాలను తెంచుకుని ఉడాయించాడు.
ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయగా హుమాయున్ నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, టాస్క్ ఫోర్స్ సీఐ సైదాబాబు, హుమాయున్ నగర్ సీఐ మల్లేష్ తోపాటు సిబ్బందితో కలిసి ఈ కేసులో విచారణ చేపట్టారు. బస్టాప్ లోని సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించారు. ఈ క్రమంలో లభ్యమైన ఆధారాలతో మల్లేపల్లి బడీ మసీదు ప్రాంత నివాసి అయిన షేక్ సద్దాం హుస్సేన్ (32)ను అరెస్ట్ చేశారు. అతని నుంచి మంగళసూత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Pithapuram News: డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో ఆటో దందా.. బెంబేలెత్తుతున్న ప్రజలు!
విచారణలో నిందితుడు సహచరుడైన రాజేశ్ తోపాటు మరికొందరితో కలిసి గతంలో నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో మొత్తం 46 నేరాలకు పాల్పడినట్టుగా వెల్లడైంది. ఇంతకు ముందు నారాయణగూడ పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టుగా తెలిసింది. అరెస్ట్ చేసిన నిందితున్ని కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్ చేశారు. పరారీలో ఉన్న అతని సహచరుల కోసం గాలిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు