తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Telangana Police: పోగొట్టుకున్నచోరీ అయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేయటంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే టాప్ 2లో నిలిచారు. రోజుకు సగటున 99 సెల్ ఫోన్లను రికవరీ చేస్తూ సరిలేరు మాకెవ్వరు అని నిరూపించుకుంటున్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం మీద ఉన్న 780 పోలీస్ స్టేషన్ల పరిధుల్లో చోరీ అయిన, పోగొట్టుకున్న 70వేల 58 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా సిబ్బంది అంకిత భావంతో పని చేయటం వల్లనే సాధ్యమైందని సీఐడీ డీజీ శిఖా గోయల్ చెప్పారు.
అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10,861, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9,259, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 7,488 ఫోన్లను రికవరీ చేసినట్టు తెలిపారు. ప్రతీరోజూ రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో మొబైల్ ఫోన్లను పోగొట్టుకుంటున్న జనం పోలీస్ స్టేషన్లలో ఇస్తున్న ఫిర్యాదులు వేల సంఖ్యలో ఉంటున్నాయి. అదే సమయంలో పిక్ పాకెటింగ్ గ్యాంగులు రద్దీగా ఉండే బస్సులు, రైళ్లలో తిరుగుతూ మార్కెట్లలో సంచరిస్తూ వందల సంఖ్యలో సెల్ ఫోన్లను కొట్టేస్తున్నారు.
Also Read: Fine Rice Distribution: ఉగాది నాడు గుడ్ న్యూస్.. సన్న బియ్యం పంపిణీ ప్రారంభం.. సీఎం రేవంత్ రెడ్డి
గతంలో ఇలా పోగొట్టుకున్న…చోరీ అయిన ఫోన్లను రికవరీ చేయటం సాధ్యమయ్యేది కాదు. అయితే, సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్ (సీఈఐఆర్) సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకు రావటం ద్వారా దీనికి పోలీసు ఉన్నతాధికారులు చెక్ పెట్టారు. ఎవరైనా ఫోన్ పోయిందనో…చోరీ అయ్యిందనో ఫిర్యాదు ఇస్తే ఆ ఫోన్ కు సంబంధించిన ఐఎంఈ నెంబర్ తీసుకుని సీఈఐఆర్ పోర్టల్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఫోన్ దొరికినవారు లేదా దొంగిలించిన వారు దాంట్లోని సిమ్ కార్డును మార్చి వేరే సిమ్ కార్డు వేసి ఆన్ చేయగానే ఆ వివరాలు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోలీసులకు అందుతున్నాయి.వెంటనే పోలీసులు మార్చిన నెంబర్ కు ఫోన్లు చేసి మొబైల్ ఫోన్లను వెనక్కి తెప్పిస్తున్నారు.
Also Read: MP Chamala Kiran Kumar: పార్లమెంటులో గొంతు నొక్కేస్తున్నారు’.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్
ఇదంతా సిబ్బంది తమ తమ విధులను అంకిత భావంతో నిర్వర్తిస్తుండటం వల్లనే సాధ్యమవుతోందని సీఐడీ డీజీ శిఖా గోయల్ అన్నారు. టెలీకాం డిపార్ట్ మెంట్ తో సమన్వయం చేసుకుని అందుబాటులోకి తీసుకొచ్చిన సీఈఐఆర్ సాంకేతిక పరిజ్ఞానం సత్ఫలితాలు ఇస్తోందన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నా…ఎవరిదైనా సెల్ ఫోన్ చోరీ అయినా వెంటనే ఐఎంఈ నెంబర్ తోపాటు అన్ని వివరాలను పేర్కొంటూ www.tspolice.gov.in లేదా www.ceir.gov.in వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయాలన్నారు. మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ టాప్ 2లో నిలబడటంలో విశేషంగా కృషి చేస్తున్న ఎస్పీ బీ.గంగారాం, ఐటీ సెల్ సిబ్బందితోపాటు డీడీజీ (సెక్యూరిటీ) హేమంత్ రత్వే, డైరెక్టర్ సెక్యూరిటీ అరవింద్ కుమార్, జేటీవో సెక్యూరిటీ నంబి మృదుపాణిలను ఆమె అభినందించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు