Bhatti Vikramarka: తెలంగాణ శాసనసభలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ (CAG) నివేదికను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాల కంటే 33 శాతం అదనంగా రూ.1,11,477 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడైంది. అయితే రూ.2,77,690 కోట్ల బడ్జెట్ అంచనాతో పోలిస్తే వాస్తవ వ్యయం కేవలం రూ.2,19,307 కోట్లుగా నమోదైంది. అయితే అందులో పూర్తిగా ఖర్చు చేయలేదని నివేదిక పేర్కొంది.
79 శాతం మాత్రమే ఖర్చు
తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న వేళ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్ అకౌంట్స్పై కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ నివేదిక ప్రకారం 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లుగా ఉండగా వాస్తవ వ్యయం రూ.2,19,307 కోట్లుగా నమోదైంది. ఇది బడ్జెట్ అంచనాల్లో 79 శాతం మాత్రమే ఖర్చు అయినట్లు సూచిస్తోంది. GSDPలో వ్యయం అంచనా 15 శాతంగా ఉందని కాగ్ నివేదిక పేర్కొంది.
వడ్డీలు, వేతనాలకే 45శాతం
ఆమోదం పొందిన బడ్జెట్ కంటే ప్రభుత్వం అదనంగా 33 శాతం, అంటే రూ.1,11,477 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఈ అదనపు ఖర్చుకు మూలంగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ద్వారా రూ.10,156 కోట్లు, అలాగే రూ.35,425 కోట్ల ఓవర్డ్రాఫ్ట్ను 145 రోజుల పాటు వినియోగించినట్లు తెలిపింది. 2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం రూ.24,347 కోట్లు, వేతనాల కోసం రూ.26,981 కోట్లు ఖర్చు చేయగా, రెవెన్యూ రాబడుల్లో 45 శాతం ఈ వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్ల కోసమే వినియోగించినట్లు నివేదిక స్పష్టం చేసింది.
కేంద్ర గ్రాంట్లు ఎంతంటే?
రాష్ట్ర ఖజానాకు పన్ను ఆదాయం నుంచి 61.83 శాతం నిధులు సమకూరగా, కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు కేవలం రూ.9,934 కోట్లుగా నమోదయ్యాయి. రెవెన్యూ మిగులు రూ.779 కోట్లుగా ఉండగా, రెవెన్యూ లోటు రూ.49,977 కోట్లుగా, జీఎస్డీపీలో ఈ లోటు 3.33 శాతంగా నివేదిక అంచనా వేసింది. 2023-24 ముగిసే సమయానికి రాష్ట్ర రుణాల మొత్తం రూ.4,03,664 కోట్లుగా, జీఎస్డీపీలో అప్పుల శాతం 27గా ఉన్నట్లు తెలిపింది. అలాగే, ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం రూ.2,20,607 కోట్లుగా నమోదైంది.
Also Read: CM Revanth on Delimitation: డీలిమిటేషన్ తో సౌత్ పై కుట్ర.. కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సీఎం రేవంత్
11 శాతం పెరుగుదల
మూలధన వ్యయం కింద రూ.43,918 కోట్లు ఖర్చు కాగా, స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు రూ.76,773 కోట్ల నిధులను ప్రభుత్వం అందించింది. ఈ నిధుల్లో 11 శాతం పెరుగుదల కనిపించినట్లు కాగ్ నివేదిక వివరించింది. ఈ నివేదిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తూ, ఖర్చులు, రుణాలు, నిధుల వినియోగంపై కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది.