Betting Apps Case: బెట్టింగ్ యాప్ ల ప్రమోసన్ల కేసుల్లో నిందితులుగా ఉన్నవారు దర్యాప్తు సంస్థల నుంచి ముప్పేట దాడిని ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే రెండు కేసుల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులు విచారణ చేస్తుండగా ఈడీ(ED) కూడా వీటిపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. తాజాగా తెలంగాణ స్టేట్ సైబర్ క్రైం బ్యూరో(Cyber Crime Bureau) అధికారులు కూడా ఈ కేసులపై దృష్టిని సారించారు. గడిచిన ఒక్క సంవత్సరంలోనే బెట్టింగ్ యాప్ లలో డబ్బు పోగొట్టుకుని 15మంది ఆత్మహత్యలు(Suicides) చేసుకున్నట్టు తెలిసిన నేపథ్యంలో చనిపోయిన వారి వివరాలను పోలీసులు(Telangana Police) సేకరిస్తున్నారు. ప్రాణాలు తీసుకున్న వారి కుటుంబ సభ్యుల నుంచి నిర్దిష్టమైన వివరాలతో ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయించారు. దాంతోపాటు బెట్టింగ్ యాప్ ల బారిన పడి ఉన్నదంతా పోగొట్టుకున్న బాధితులు కూడా కంప్లయింట్లు ఇవ్వటానికి ముందుకు రావాలని అధికారులు చెబుతున్నారు. స్పష్టమైన వివరాలతో ఫిర్కాదులు అందితే మరింత పకడ్భంధీగా కేసులను విచారించవచ్చని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఇప్పటికే నమోదైన కేసుల్లో కొత్త సెక్షన్లు జత అవుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా బెట్టింగ్ యాప్ ల నిర్వాహకులు, వాటిని ప్రమోట్ చేసిన వారు తప్పించుకునే అవకాశాలు తగ్గుతాయని వివరించారు.
Online Gaming Gang Arrested: బెట్టింగ్ లో తొలి వికెట్.. సట్టా గ్యాంగ్ అరెస్ట్
వినయ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు 11మంది బుల్లితెర నటులు, ఇన్ ప్లూయెన్సర్ల(Social Media Influencers)పై కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని విచారించారు కూడా. కాగా, ఫణీంద్ర శర్మ అనే వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు రెండు రోజుల క్రితం మరో కేసు నమోదు చేశారు. దీంట్లో టాలీవుడ్ స్టార్లు రాణా దగ్గుపాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతతోపాటు మొత్తం 25మంది నిందితులుగా ఉన్నారు.
మనీలాండరింగ్ కోణం
ఇదిలా ఉండగా ఈ కేసులను దర్యాప్తు చేయటానికి వేర్వేరు దర్యాప్తు ఏజన్సీలు రంగంలోకి దిగుతున్నాయి. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు మనీ లాండరింగ్(Money Laundering) ద్వారా డబ్బును కొల్లగొట్టారని నిర్ధారించుకున్న ఈడీ అధికారులు ఇప్పటికే పంజాగుట్ట కేసు వివరాలను తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. తాజాగా మియాపూర్ స్టేషన్ లో నమోదైన కేసులో కూడా విచారణ జరపాలని నిర్ణయించారు. తాజాగా తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కూడా బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన కేసులపై దృష్టిని సారించారు. తెలంగాణలో ఈ యాప్ లు నిషిద్ధమని స్పష్టం చేసిన సైబర్ సెక్యూరిటీ అధికారులు బాధితులు ఫిర్యాదు ఇస్తే బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ఇంటర్ నెట్ ఆధారంగా ఈ నేరాలు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే నమోదైన కేసుల్లో కూడా విచారణ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
లోతుగా దర్యాప్తు
ఇక, బెట్టింగ్ యాప్ ల వ్యవహారంలో నిర్దిష్టమైన వివరాలతో ఫిర్యాదులు స్వీకరించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. పంజాగుట్ట, మియాపూర్ పోలీసులకు అందిన కంప్లయింట్లలో ఫలానా ఫలానా సెలబ్రెటీలు ఫలానా ఫలానా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారన్న వివరాలు మాత్రమే ఉన్నాయి. ఆయా యాప్ లలో ఎవరైనా సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారా? ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారా? అన్న సమాచారం లేదు. దీంతో నేర నిరూపణ జరిగితే నిందితులకు కఠినమైన శిక్షలు పడే అవకాశమున్న సెక్షన్లను పోలీసులు ఎఫ్ఐఆర్ లలో పేర్కొనలేదు. ఇలా కాకుండా పక్కా వివరాలతో ఫిర్యాదులు తీసుకుని అంతే పకడ్భంధీగా కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం.
ఒక్క ఏడాదిలోనే 15మంది…
పకడ్భందీగా కేసులు నమోదు చేస్తే తప్ప బెట్టింట్ యాప్ లకు కళ్లెం పడదని భావిస్తున్న అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. గత ఒక్క సంవత్సరంలోనే బెట్టింగ్ యాప్ లలో భారీ మొత్తాల్లో డబ్బులు పోగొట్టుకుని 15మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు తెలిసిన నేపథ్యంలో చనిపోయిన వారి కుటుంబాల నుండి తాజాగా ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయించారు. ఏ యాప్ లో డబ్బు పోగొట్టుకున్నారు? ఎంత పోగొట్టుకున్నారు? ఆయా యాప్ లను ప్రమోట్ చేసింది ఎవరు? అన్న వివరాలతో కేసులు నమోదు చేయాలని నిశ్చయించారు. స్పష్టమైన వివరాలు ఉండే పకడ్భంధీగా కేసులు పెట్టటంతోపాటు అంతే పకడ్భంధీగా విచారణ జరిపి కోర్టులకు ఛార్జీషీట్లు సమర్పించే అవకాశం ఉంటుందని పోలీస్ వర్గాలు తెలిపాయి.