- మళ్లీ తెరపై రెండవ రాజధాని అంశం
- రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్
- నగరానికి అన్ని అర్హతలున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి
- త్వరలో నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం
- అంతర్జాతీయ విమానాశ్రయం హామీ
- వరంగల్ అభివృద్ధి కి తూట్లు పొడిచిన బీఆర్ఎస్
- మాటలు తప్ప నిధులు ఇవ్వని కేసీఆర్ సర్కార్
- ఇప్పటికే స్మార్ట్ సిటీల జాబితాలో వరంగల్ కు చోటు
- సీఎం హామీతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ఓరుగల్లు వాసులు
Telangana Second Capital Warangal proposed C.M.Reventh Reddy:
జనాభా పెరిగిపోతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వారి అవసరాలను నగరాలు తీర్చలేకపోతున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ , పొల్యూషన్ వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే ప్రత్యామ్నాయ నగరాల అభివృద్ధి తప్పనిసరిగా మారింది. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన జనాభాకు తోడు ట్రాఫిక్ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భాగ్యనగరానికి రెండో రాజధాని అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్న నగరం ఏదైనా ఉందా అంటే అది వరంగల్ మాత్రమే. అయితే పలు రాజకీయ కారణాలతో వరంగల్ రెండో రాజధానిగా మారే పరిస్థితులు పెండింగ్ పడుతూ వస్తున్నాయి.బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి వరంగల్ ను అది చేస్తాం..ఇది చేస్తాం అనడం తప్ప చేసిందేమీ లేదు.
దశ మారనున్న ఓరుగల్లు
తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. వరంగల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్తో పాటు వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో మళ్లీ వరంగల్ రెండో రాజధాని అంశం తెరపైకి వచ్చింది.
వరంగల్, హనుమకొండ, కాజీపేట దగ్గర దగ్గరే ఉండటం వల్ల రాజధానిగా మారేందుకు అన్ని అనుకూలతలు ఉన్నాయి. నిజానికి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందిన నగరం వరంగలే. గతంలో రాజధాని అంశాన్ని బీఆర్ఎస్ మంత్రులు కూడా లేవనెత్తారు. తెలంగాణ రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేటీఆర్ పలు సందర్భాలలో అన్నారు.
ప్రగతి పథంలో దూసుకెళుతున్న సిటీ
పోరాటాల గడ్డ ఓరుగల్లు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా మారింది. చారిత్రకంగా, పర్యాటకంగా వైద్యం, విద్య ఇలా ఏ రంగం చూసినా అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. వరంగల్ ను హైదరాబాద్ కు దీటుగా తీర్చిదిద్దడానికి కావలసిన అన్ని హంగులూ కల్పిస్తే దాని రూపురేఖలే మారిపోనున్నాయి. ఇప్పటికే ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలూ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. విద్యా కేంద్రంగా ఉన్న వరంగల్ మహానగరం, పారిశ్రామికంగానూ ముఖ్యంగా ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే ఐటీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హైదరాబాద్కు అనుబంధంగా వరంగల్లో ఈ రంగాన్ని విస్త రించే విషయంలో మరింత శ్రద్ధచూపితే స్మార్ట్ సిటీల సరసన చేరడం ఖాయం.
ఐటీ హబ్ గా మారనున్న వరంగల్
తెలం గాణలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ హైదరాబాద్కు దగ్గర్లో ఉండడం… రైలు, జాతీయ రహదారి వంటి మెరుగైన రవాణా సౌకర్యాలు వరంగల్ నగరానికి అను కూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వరంగల్-హైదరాబాద్ దారిలో ప్రత్యేంగా ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తే నగరం నాలుగు చెరుగులా శరవేగంతో అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు.
బెంగళూరుకు తోడుగా మైసూరు అభివృద్ధి చెందినట్లుగానే.. హైదరాబాద్కు తోడుగా వరంగల్ను ప్రభుత్వం ఐటీ పరంగా అభివృద్ధి చేయాలి. . మైండ్ ట్రీ, జెన్ ప్యాక్ట్, టెక్ మహీంద్రా, సయంట్, క్వాడ్రంట్ వంటి కంపెనీలు ఇప్పటికే వరంగల్లో కార్యకలాపాలు మొదలుపెట్టాయి. సాఫ్ట్పాత్ కంపెనీ విస్తరణలో భాగంగా వరంగల్లో కార్యకలాపాలను పెంచింది. జెన్ ప్యాక్ట్, హెచ్ ఆర్హెచ్ నెక్ట్స్, హెక్సాడ్, ఎల్అండ్టీ-మైండ్ ట్రీ వంటి కొత్త ఐటీ కంపెనీ ల్లో రెండు వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఇక టూరిజంగానూ ఇప్పటికే వరంగల్ ప్రాంతం తన ప్రత్యేకత చాటుకుంది. ఇన్ని అనుకూల అంశాలు ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హయాంలో వరంగల్ రెండో రాజధానిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.