– ఇదే పని కేంద్రమూ చేస్తే ఏం చేస్తారు?
– ఆరు నెలలైనా హామీల అమలేదీ?
– జనసేనతో పొత్తుపై నిర్ణయం అధిష్ఠానానిదే
– కేంద్రమంత్రి బండి సంజయ్
Congress Govt: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజక వర్గాలకు నిధులు కేటాయించటం లేదని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన అటకెక్కిందని కామెంట్ చేశారు. కేవలం 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తిస్థాయిలో వ్యతిరేకత వచ్చిందని, నేటికీ గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు జరగటంలేదని మండిపడ్డారు. పల్లెల్లో రూ.4 వేల వృద్ధాప్య పెన్షన్, ప్రతి మహిళకు ఇస్తామన్న రూ.2,500 కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని, రైతు రుణమాఫీ, రైతు భరోసా రూ.15వేల కోసం రైతాంగం ఎప్పుడిస్తారంటూ అన్నదాతలు నిరాశ చెందుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలకు నిధులు కేటాయించకపోవడం దారుణమని సంజయ్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్న చోట మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తోందని, బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట వారు వినతి పత్రాలు ఇచ్చినా ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ నడిచిన బాటలోనే రేవంత్ రెడ్డి కూడా సాగుతున్నారని, ఇదిలాగే కొనసాగితే, కేసీఆర్ మీద తిరగబడినట్లే కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ప్రజలు తిరుగుబాటు చేస్తారని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
కేంద్రంలోని ప్రభుత్వం తెలంగాణ ప్రగతికి అండగా నిలిచి, మద్దతునిస్తుంటే, రాష్ట్రంలోని ప్రభుత్వం మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట పక్షపాతం చూపటం సరికాదని, కేంద్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఎంపీలకు నిధులు ఇవ్వకుంటే పరిస్థితేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఖరి వల్ల తెలంగాణ ప్రగతి దెబ్బతింటుందని, ఇకనైనా ముఖ్యమంత్రి ఈ పద్ధతిని మానుకోవాలన్నారు. ఇక పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలపైనా సంజయ్ స్పందించారు. అవసరాన్ని బట్టి కండువాలు మార్చటం అనేది వారి విజ్ఞతకు సంబంధించిన విషయమని అన్నారు. ఇక తెలంగాణలో జనసేన పొత్తు గురించి ప్రశ్నించగా.. ఆ విషయాన్ని తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. సింగరేణి విషయంలో బీఆర్స్ సాగిన దారిలోనే కాంగ్రెస్ నడుస్తోందని వ్యాఖ్యానించారు.