– విదేశాల నుంచే ఖాకీలకు షాక్
– బయటపడిన ప్రభాకర్ రావు లీలలు
– విధేయుల సాయంతో విచారణ గురించి ఆరా తీస్తున్న వైనం
– ఖాకీల లోపాల ఆధారంగా బెయిల్ పొందేందుకు ఎత్తులు
Prabhakar Rao: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికరమైన పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మంగళవారం మరోసారి మ్యాన్డేట్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, మంగళవారం నాంపల్లి కోర్టు పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటులో కొన్ని పొరపాట్లు గుర్తించి దానిని వెనక్కి పంపించింది. అయితే, ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ప్రభాకర రావు.. వెంటనే మ్యాన్డేట్ బెయిల్ను దాఖలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు సూచించిన సూచనలు పాటిస్తూ బుధవారం తిరిగి చార్జిషీటును దాఖలు చేశారు.
ఈ ఘటనతో ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారులంతా ఒక్కసారి అలెర్ట్ అయ్యారు. ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తికి ఇక్కడి విషయాలు ఇంత వేగంగా తెలుస్తున్నాయనే కోణంలో వారు విచారణ చేపట్టారు. గతంలో ఆయన వద్ద పనిచేసిన అధికారులే పోలీసుల చర్యలను ఎప్పటికప్పడు చేరవేస్తున్నారని భావించిన అధికారులు వారి ఆచూకీ కనిపెట్టే పనిలో పడ్డారు. కాగా, ఈ కేసులో ప్రభాకర్ రావును అరెస్టు చేసి, మరిన్ని ఆధారాలను సంపాదించాలనే పట్టుదలతో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు మాత్రం ఈ పరిణామం మింగుడుపడటం లేదు. ఇకపై ఇలాంటివి జరగకుండా, మరింత గోప్యంగా విచారణను ముందుకు తీసుకుపోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.