– విద్యుత్ కొనుగోళ్లపై దుమారం
– మాజీ ఇంధన శాఖ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు
– కమిషన్ ముందు నోరువిప్పిన అరవింద్ కుమార్
– ఓపెన్ బిడ్డింగ్ వద్దన్నందుకు మర్నాడే బదిలీ
– తన లేఖను బుట్టదాఖలు చేశారని ఆవేదన
– మాజీ సీఎం కేసీఆర్ సహా 24 మందికి నోటీసులు
– త్వరలో కమిషన్ ముందుకు ప్రజాప్రతినిధులు
– నర్సింహారెడ్డి కమిషన్ విచారణలో ఆసక్తికర అంశాలు
– తొమ్మిదిన్నరేళ్లలో జవాబు లేని ప్రశ్నలెన్నో..
– ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనం
Power Purchase: తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెను దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. కరెంట్ సెంటిమెంట్ను గత ప్రభుత్వంలోని పెద్దలు తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుని, భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారనే ఆరోపలున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల వ్యవహారంలో జరిగిన గోల్మాల్పై ఈ కమిషన్ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా 25 మందికి నోటీసులు ఇచ్చింది.
కేసీఆర్కు నోటీసు..
విచారణలో భాగంగా కమిషన్ తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు నోటీసు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లోని కీలక వివరాలను జూన్ 15 లోపు కమిషన్ ముందు హాజరై తెలియజేయాలని ఆ నోటీసుల్లో కమిషన్ కోరింది. అయితే సమాధానం ఇచ్చేందుకు జూలై 30 వరకు సమయం కావాలని కేసీఆర్ కోరారు. మాజీ సీఎం స్పందన సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగత హాజరు ప్రక్రియను ప్రారంభిస్తామని కమిషన్ హెచ్చరించింది. కరెంటు కొనుగోళ్లపై నాటి అధికారులను విచారించిన నర్సింహారెడ్డి కమిషన్.. ప్రస్తుతం కేసీఆర్కు నోటీసు పంపిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరికొందరు ప్రజా ప్రతినిధులకూ నోటీసులు అందనున్నట్లు తెలుస్తోంది.
నోటీసులు వీరికే..
కమిషన్ నోటీసులు అందుకున్న వారిలో 2016 నాటి ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, సుదీర్ఘకాలం ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా ఉన్న దేవులపల్లి ప్రభాకర్రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ జి.రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ మాజీ సీఎండీలు కె.వెంకటనారాయణ, ఎ.గోపాల్రావుతోపాటు ఆయా విద్యుత్ సంస్థల మాజీ, ప్రస్తుత డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులున్నారు. వీరుగాక, నామినేషన్లపై యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను దక్కించుకున్న బీహెచ్ఈఎల్ సంస్థ ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు, ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారులకూ నోటీసులు అందాయి.
చెప్పినా వినలేదు..
మంగళవారం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు 2016లో ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 2016లో తాను రెగ్యులేటరీ కమిషన్కు రాసిన లేఖ గురించి కమిషన్ ముందు ప్రస్తావించారు. నేరుగా వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని, ఓపెన్ బిడ్డింగ్ ద్వారా డబ్బు ఆదా అవుతుందని తాను ఆనాడే లేఖలో ప్రభుత్వానికి చెప్పానని గుర్తు చేశారు. అలాగే, రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి అధికారం ఇవ్వాలనీ, కానీ ఈ ఒప్పందంలో అన్ని అధికారాలనూ ఛత్తీస్ఘడ్కే అప్పగించారనీ అరవింద్ కుమార్ నేడు కమిషన్ ముందు వెల్లడించారు. ఈ నిర్ణయం తర్వాత తనను ఆ శాఖ నుంచి మరోచోటకు బదిలీ చేశారని అరవింద్ కుమార్ తెలిపారని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి చెప్పారు.
వద్దన్నందుకు బదిలీ వేటు
ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని, ఆ ఒప్పందాన్ని ఆమోదించవద్దని కోరుతూ నాటి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్ 2016 డిసెంబర్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి లేఖ రాశారు. దీనిపై ఆగ్రహించిన అప్పటి సర్కారు పెద్దలు 24 గంటల్లోనే ఆయనను ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేశారు. తాజాగా ఆయనకు కూడా విచారణ కమిషన్ నోటీసులు జారీ చేయడంతో.. నాటి లేఖ, ఆయన వివరణ కీలకంకానున్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జవాబు లేని ప్రశ్నలు
1) 2014లో బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియను అనుసరించకుండా నామినేషన్ ప్రాతిపదికన ఛత్తీస్గఢ్ డిస్కమ్స్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం తక్కువ ధరకు విద్యుత్ ఇస్తున్నా… అధిక ధరకు ఛత్తీస్ఘడ్ నుంచి అధిక ధరకు ఎందుకు విద్యుత్ కొనుగోలు చేశారనేదానిపై స్పష్టత లేదు. ఈ విద్యుత్ను ప్రతి యూనిట్కు రూ.5.86 లెక్కన ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 78,970 మిలియన్ యూనిట్ల కరెంటు కొనుగోలుకు రూ. 39,722 కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. ఛత్తీస్ఘడ్ కారిడార్ను వాడకుండానే రూ.638.50 కోట్లు అప్పనంగా ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లులు చెల్లించారు. ఈఆర్సీ ఆమోదించిన అగ్రికల్చర్ సేల్స్, డిస్కంలు అంచనా వేసిన సేల్స్ మధ్య వ్యత్యాసం (నష్టాలతో కలిపి) 39,798 మిలియన్ యూనిట్లు. దీనిమూలంగా ఖజానా మీద పడిన అదనపు భారం విలువ.. రూ.18,725 కోట్లు.
2) రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1080 మెగావాట్ల సామర్థ్యం గల భద్రాద్రి థర్మల్ ప్లాంట్ ప్రాజెక్టు మాత్రమే పూర్తి చేశారు. రెండేండ్లలో పూర్తి చేయాల్సిన ప్లాంట్ నిర్మాణానికి ఏడేళ్ల సమయం తీసుకున్నారు. అలాగే, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సూపర్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగించారు. గుజరాత్ కంపెనీ నుంచి రూ.వెయ్యి కోట్ల లంచం తీసుకుని కాలం చెల్లిన సబ్క్రిటికల్ టెక్నాలజీని కొనుగోలు చేశారని, ఫలితంగా వేల కోట్ల భారం ట్రాన్స్కో, జెన్కో, డిస్కాంలపై పడిందనే ఆరోపణలున్నాయి.
3) బొగ్గు గనులకు దూరంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను దామరచర్లలో నిర్మించడానికి కారణాలేమిటో కూడా నేటికీ జవాబు లేని ప్రశ్నగా మారిపోయింది. 29 వేల కోట్లతోని యాదాద్రి పవర్ స్టేషన్కు శంకుస్థాపన చేసి, తొమ్మిది ఏండ్లు దాటిని పవర్ స్టేషన్ నిర్మాణం పూర్తికాలేదు. దీంతో దీని మూలంగా డిస్కమ్లపై భారం పడింది. అలాగే, యాదాద్రి పవర్ప్లాంట్ నిర్మాణపు పనులను ఎలాంటి టెండర్ లేకుండా బీహెచ్ఈఎల్కు అప్పగించటం, సొంత కాంట్రాక్టర్కు సివిల్ వర్క్ పనులు కేటాయించటం, ఐఏఎస్లు నిర్వహించాల్సిన బాధ్యతలను స్థాయి, అనుభవం లేని రిటైర్డ్ ఉద్యోగులు ప్రభాకర్రావు, రఘుమారెడ్డి, గోపాలరావు వంటి వారికి అప్పగించటంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
4) తెలంగాణ జెన్ కో సంస్థ అప్పులు రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 7,662 కోట్లు ఉంటే.. ఇప్పుడవి నాలుగు రెట్లు పెరిగి రూ. 32,797 కోట్లకు చేరాయి. ఇతర అవసరాలంటూ చేసిన అప్పులు మరో.. రూ.14,631కోట్లు కలిపితే ఇది రూ.53 వేల కోట్లకు దాటింది. ఇక.. తెలంగాణ ట్రాన్స్కో రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.2,411కోట్లు అప్పుల్లో ఉంటే గత పదేండ్లలో ఈ అప్పుల మొత్తం రూ.10,529 కోట్లకు చేరాయి. ఇతరాల పేరుతో చేసినవి కలుపుకుంటే ట్రాన్స్కో అప్పు లు రూ.24,476కోట్లకు చేరుకున్నాయి. పదేళ్లలో నాలుగురెట్ల అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో జవాబు లేని ప్రశ్నగా ఉండిపోయింది.
5) 2014 నాటికి విద్యుత్ శాఖకు ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బాకీలు రూ. 1,595.37 కోట్లు కాగా, ఈ పదేండ్లలో ఇది రూ. 28,842 కోట్లు అయింది. వీటిలో సాగునీటి శాఖ అప్పు రూ.14,193 కోట్లు, మిషన్ భగీరథ బాకీ రూ.3,558.83 కోట్లు, పంచాయితీరాజ్ శాఖ చెల్లించాల్సిన రూ.4,393.99 కోట్లు, వాటర్ బోర్డు బాకీలు రూ. 3,932.47 కోట్లు, మున్సిపాల్టీల బాకీలు రూ.1,657.81 కోట్లు, కేంద్రం చెల్లించాల్సిన బకాయిలు రూ.720 కోట్లు. ఈ పదేళ్ల కాలంలో ఈ బాకీల వసూలుకు ప్రభుత్వం చేసిందేమిటో నేటికీ క్లారిటీ లేదు.
6) గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తామని చెప్పి, చెల్లించని విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చులు (ట్రూ అప్ చార్జీలు) మొత్తం.. రూ. 14,928కోట్లుగా ఉంది. ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్సీఏ) రూ.2,378 కోట్లు. మరోవైపు, సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బాకీ రూ. 19,431 కోట్లు.
7) మొత్తంగా తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పుల మొత్తం రూ. 81,516 కోట్లు కాగా, ఇవిగాక డిస్కంల నష్టాలు రూ. 62,461 కోట్లు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటించకపోవటం వల్లనే డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని విద్యుత్ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. డిస్కంల అప్పుల కారణంగా దేశంలోని డిస్కంల ర్యాంకింగ్ల్లో తెలంగాణ బీ ప్లస్ ర్యాంక్ నుంచి సీ కేటగిరిలోకి పడిపోయిందనీ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.