- జులై 1 నుంచి కొత్త చట్టాల నిబంధనలు
- బ్రిటీష్ వలస పాలన నాటి చట్టాలకు చెల్లుచీటీ
- ఫిర్యాదుల నుంచి సమన్ల జారీ వరకు అన్నీ ఆన్లైన్లోనే
- సత్వర న్యాయానికి రెండంటే రెండే వాయిదాలు
- హేయమైన నేరాల దృశ్యాలకు వీడియోగ్రఫీ తప్పనిసరి
- పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా జీరో ఎఫ్ఐఆర్
- గత ఏడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం
- డిసెంబర్ 25న రాష్ట్రపతి ఆమోద ముద్ర
Bharatiya Nyaya Sanhita New Criminal Laws Crimes FIR july 1 onwards:
జూలై 1 నుంచి దేశంలో కొత్తగా నేర న్యాయ చట్టాలలో భారీ మార్పులు రానున్నాయి. . ప్రస్తుతం ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లలో భారీ మార్పులు చేసిన ప్రభుత్వం దానిని ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్’ గా మార్చింది. కాగా ఈ కొత్త చట్టాల అమల్లో పలు మార్పులు కనిపించనున్నాయి. ఇకపై అన్నీ ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే జరగనున్నాయి. హేయమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేస్తారు. ఈ కొత్త చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దాదాపు 40 లక్షలమంది క్షేత్రస్థాయి సిబ్బందికి, 5.65 లక్షల మంది పోలీసులు, జైళ్ల అధికారులు, ఫోరెన్సిక్ నిపుణలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మూడు కొత్త చట్టాలకు గత ఏడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం లభించగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 25న ఆమెకు ఆమోదం తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మూడు ఒకే విధమైన నోటిఫికేషన్ల ప్రకారం, కొత్త చట్టాల నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. బ్రిటీష్ వలస పాలన నాటి చట్టాల స్థానంలో కొత్తగా నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
అన్నీ ఆన్ లైన్ లోనే..
ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్లేస్ లో భారతీయ సాక్ష్య అధినయమ్ 2023 అమలులోకి రానున్నాయి. జీరో ఎఫ్ఐఆర్, ఆన్ లైన్ లో పోలీసు ఫిర్యాదు, ఎలక్ట్రానిక్ రూపంలోనే సమన్లు, దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించడం వంటి కీలక అంశాలను ఈ కొత్త చట్టాల్లో ఉండనున్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్ కు వెళ్లనవసరం లేకుండానే ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసేందుకు వీలు కలగనున్నది. దీంతో తేలికగా, వేగంగా సమస్యను తెలియజేయవచ్చు. ఇప్పటికే పోలీసులకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు ట్రైనింగ్ ఇచ్చారు. బాధితుడు ఇకపై నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయొచ్చు. జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఎవరైనా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు.అరెస్ట్ అయిన బాధితుడు ఆ విషయాన్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు తన పరిస్థితి తెలియజేసే వీలుంటుంది. దీనివల్ల బాధితుడికి తక్షణసాయం లభించే వీలుంటుంది. అరెస్ట్ వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తోపాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. దీనివల్ల బాధితుల కుటుంబ సభ్యులు, స్నేహితులకు ముఖ్యమైన సమాచారం తెలిసే వీలుంటుంది.
దర్యాప్తులో నాణ్యత
హేయమైన నేరాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీనివల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగే అవకాశం ఉంది. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తికావాలి. బాధిత మహిళలు, చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది. సమన్లను ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పనిలేదు. ఆన్లైన్లో పంపించవచ్చు. మహిళలపై నేరాల విషయంలో బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి. వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలి. బాధితులతోపాటు నిందితులకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ నకలును ఉచితంగా అందిస్తారు. పోలీస్ రిపోర్ట్, చార్జిషీట్, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను రెండువారాల్లో పొందొచ్చు. కేసు విచారణలో అనవసర ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి.
ఉన్న చోటే పోలీసు సాయం
సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలుచేయాలి. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లకు మించి వయసున్నవారు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. వారు తాము నివసిస్తున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు.