- హిందూజా కుటుంబంలో నలుగురికి జైలు శిక్ష
- పనివారి కన్నా కుక్కలకే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారని అభియోగం
- జెనీవాలో ఓ విల్లాలో నివాసముంటున్న హిందూజా ఫ్యామిలీ
- కోర్టులో నిరూపితం అయిన అభియోగాలు
- ప్రకాశ్ హిందూజా, ఆయన భార్య కమల్ కు చెరో నాలుగున్నరేళ్లు
- కుమారుడు అజయ్, కోడలు నమ్మతకు చెరో నాలుగేళ్ల శిక్ష
- Swiఎగువ కోర్టులో అప్పీల్ చేస్తామన్నహిందూజా తరపున న్యాయవాది
4 Hinduja family members get jail terms for exploiting servants:
అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్న భారత సంతతికి చెందిన హిందూజా కుటుంబ సభ్యులకు స్విట్జర్లాండ్లోని ఓ కోర్టు జైలు శిక్ష విధించింది. బ్రిటన్ లోనే హిందూజా కుటుంబం అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటి. స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ప్రకాశ్ హిందూజా కుటుంబానికి ఓ విల్లా ఉంది. ఆ విల్లాలో పనిచేసే సిబ్బంది కంటే పెంపుడు కుక్కలకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారనే అభియోగాలు నిరూపితం కావడంతో హిందూజా కుటుంబంలోని నలుగురికి కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రకాశ్ హిందూజా, ఆయన భార్య కమల్ కు చెరో నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధిదంచారు. ప్రకాశ్ హిందూజా కుమారుడు అజయ్, కోడలు నమ్మతకు చెరో నాలుగేళ్ల శిక్ష పడింది. అయితే కోర్టు ఈ తీర్పును వెలువరించే సమయంలో వీరెవరూ అక్కడ లేరు. ప్రకాశ్ హిందూజా వ్యాపార కుటుంబ వ్యవహారాలు చూసుకునే నజీబ్ జియాజీకి న్యాయస్థానం 18 నెలల సస్పెన్షన్ విధించింది. ఈ కేసులో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలను మాత్రం కోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పుపై ఎగువ న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని ప్రకాశ్ హిందూజా తరపున న్యాయవాది తెలిపారు.
నిరక్షరాస్యులైన భారతీయులను తెచ్చి..
నిరక్షరాస్యులైన భారతీయులను తీసుకొచ్చి జెనీవాలోని తమ విలాసవంతమైన విల్లాలో సేవకులుగా నియమించుకున్నారని, వారి పాస్పోర్టులను ప్రకాశ్ హిందుజా కుటుంబం తీసేసుకుందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వేతనాలను స్విస్ కరెన్సీలో కాకుండా రూపాయల్లో చెల్లుస్తున్నారని, అదీ కూడా సేవకుల చేతికి ఇవ్వకుండా భారత్లోని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారని తెలిపింది. రోజుకు 15-18 గంటలకుపైగా పనిచేయించుకోవడం, తగు విశ్రాంత సమయాన్ని ఇవ్వకపోడం, విల్లాని వదిలి వెళ్లటానికి అనుమతించకపోవడం వంటి నేరారోపణలు మోపింది. 18 గంటలు పనిచేస్తే 6.19 పౌండ్ల (652 రూపాయలు) కంటే తక్కువ చెల్లిస్తున్నారని, ఇంట్లో ఉండే పెంపుడు శునకానికి మాత్రం ఏడాదికి 7615 (సుమారు 8లక్షలు) పౌండ్లు ఖర్చు చేస్తున్నారని తెలిపింది. స్విట్జర్లాండ్ చట్టాలను ఉల్లంఘించారని, ఆ కుటుంబంలో నలుగురిపై చర్యులు తీసుకోవాలని ప్రాసిక్యూషన్ కోరింది. కేసును విచారించిన జెనీవా కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
పై కోర్టుకు వెళతాం
అయితే తీర్పు సమయంలో నలుగురు కోర్టులో లేరు. వారి మేనేజర్ హాజరయ్యారు. అతనికి 18 నెలలు జైలు శిక్ష విధించినప్పటికీ, అమలు చేయకుండా నిలిపివేసింది. ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని ప్రకాశ్ హిందుజా తరఫు న్యాయవాది తెలిపారు. రెండు దశాబ్దాల కిందటే హిందుజా కుటుంబం స్విస్ పౌరసత్వాన్ని పొందారు. 2007లోనూ ఇవే తరహా నేరాలకు ప్రకాశ్ హిందుజాను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కుటుంబం పన్నులకు సంబంధించిన కేసును కూడా ఎదుర్కొంటోంది.