Harish Rao: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో భంగపడ్డ బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో కుదేలైంది. పార్టీ క్యాడర్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఏమిటనే ఆందోళన పార్టీ కార్యకర్తలు, నాయకుల్లోనూ వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ గులాబీ పార్టీపై సంచలన ఆరోపణలు చేసింది. పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ కొత్త కుట్రకు తెరలేపాడని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
కేసీఆర్ కొత్త సర్కస్ మొదలు పెట్టాడని, అల్లుడు హరీశ్ రావును కేసీఆర్ బీజేపీలోకి పంపి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునే కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘నువ్వు కొట్టినట్టు చెయ్యి.. నేను తిట్టినట్టు చేస్తా అనే మీ పాత ఎత్తుగడలు అర్థం కాక మీ ఎమ్మెల్యేలు ఆగం అవుతున్నారు. బిడ్డం కోసం, పార్టీ కోసం, ఆస్తుల కోసం అల్లుడు హరీశ్ రావు భుజంపై తుపాకీ పెట్టి కాల్చే కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.
లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంలోనే ఈ ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులు వస్తాయని అనుకున్నారు. ఈ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. కంచుకోటగా ఉన్న మెదక్ ఎంపీ సీటును కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కొత్త రాష్ట్రాన్ని రెండు పర్యాయాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో మింగుడుపడని ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ వేగంగా రాష్ట్రంలో పుంజుకుంటున్నది. ఇది బీఆర్ఎస్ ఉనికికి దెబ్బగా మారింది.
కేసీఆర్ కొత్త సర్కస్ మొదలు..
అల్లుడు హరిష్ ను బీజేపీలోకి పంపి పార్టీని కాపాడుకునే కొత్త కుట్రలకు తెర లేపుతున్న కెసీఆర్.
నువ్వు కొట్టినట్టు చెయ్యి..నేను తిట్టినట్టు చేస్తా అనే మీ పాత ఎత్తుగడలు అర్థం కాక మీ ఎమ్మెల్యేలు ఆగం అవుతున్నారు.
బిడ్డ కోసం, పార్టీ కోసం, ఆస్తుల కోసం… pic.twitter.com/lOlFnENSCh
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) June 10, 2024