– బీఆర్ఎస్లో వణుకు మొదలైంది
– కేసీఆర్ది మేకపోతు గాంభీర్యం
– లిక్కర్ కేసులో అప్రూవర్గా మారబోతున్న కవిత
– విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి
– విచారణకు రమ్మంటే కేసీఆర్ ఎందుకు వెళ్లడం లేదు
– అర్హత లేని భూములకు రైతు బంధు ఇచ్చారు
– కేసీఆర్ పాలనపై యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్
BRS Party: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఫాంహౌస్కు పిలిస్తే వాళ్లంతా ఢిల్లీకి పోతున్నారని, ఎవరూ పార్టీలో ఉండేలా లేరని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. రేపు అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీలో బావ బామ్మర్ది(హరీశ్ రావు, కేటీఆర్) మాత్రమే మిగిలి ఉంటారేమో అంటూ ఎద్దేవ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర యెన్నెం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్, బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత అప్రూవర్గా మారబోతున్నట్టు తెలుస్తున్నదని, అందుకే బీఆర్ఎస్లో వణుకు మొదలైందని యెన్నం ఆరోపించారు. కానీ, కేసీఆర్ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.
విద్యుత్ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ చేయమని మొదటిసారి చెప్పిందే కేసీఆర్ అని, ఇప్పుడేమో విచారణకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. చిన్న అభియోగం వచ్చినా, అభియోగమేనని, దర్యాప్తునకు హాజరు కావాల్సిందేనని చెప్పారు. చిన్న అభియోగంతోనే పీవీ నర్సింహారావు బోను ఎక్కారని గుర్తు చేశారు. అలాంటిది ఆయన ముందు కేసీఆర్ ఎంత అని ప్రశ్నిస్తూ, ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేరని స్పష్టం చేశారు. రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని, రాష్ట్ర భవిష్యత్ను అంధకారంలోకి నెట్టార ఎమ్మెల్యే విమర్శించారు. అర్హత లేని 42 లక్షల ఎకరాలకు రైతు బంధు వేశారని ఆరోపించారు.
కేసీఆర్ చేసిన అప్పులను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తీరుస్తున్నారని, సాగు అవుతున్న ఎకరాలకే రైతు బంధు వేస్తున్నారని వివరించారు. ధరణిని అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం వేల కోట్ల భూములను కబ్జా చేసిందని, మోదీ కళ్లల్లో కళ్లు పెట్టి చూసే ధైర్యం లేని కేసీఆర్, ఆయన రాష్ట్రానికి వస్తే ఆహ్వానించకుండా అవమానించారని విమర్శించారు. కానీ, రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం మోదీని కలిశారని, ప్రత్యేక నిధులనూ విడుదల చేయాలని కోరారని తెలిపారు. కేసీఆర్ ఇప్పటికైనా నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే మంచిదని యెన్నం శ్రీనివాస్ రెడ్డి హితవు పలికారు.