– బీఆర్ఎస్ ఇక ఉంటుందో లేదో
– అయోధ్యలో బీజేపీ గెలవడం రాముడికీ ఇష్టం లేదు
– కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో పదిలం
– నేను కాంగ్రెస్లో చేరడాన్ని ప్రజలు స్వాగతించారు: కడియం శ్రీహరి
BRS Party: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్రంలో చక్రం తిప్పుతానని, ప్రధాని పదవి అంటూ రకరకాల మాటలు మాట్లాడారని అన్నారు. థర్డ్ ఫ్రంట్ అంటూ కొన్నాళ్లు తిరిగారని చెప్పారు. కానీ, ఈ లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోకపోయారని విమర్శించారు. మున్ముందు ఆ పార్టీ ఉంటుందో? కాలగర్భంలో కలిసిపోతుందో తెలియకుందని చెప్పారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరుతారో కూడా చెప్పలేమని పేర్కొన్నారు.
అనుకున్న విధంగా ఫలితాలు రాలేవని, ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవని బీజేపీ నాయకులు ఎగిరిపడటం మానుకోవాలని కడియం శ్రీహరి హితవు పలికారు. స్థాయికి మించి విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రామ మందిరం కట్టిన అయోధ్య ఉండే ఫైజాబాద్లోనే బీజేపీ ఓడిపోయిందని, అక్కడ బీజేపీ అభ్యర్థి గెలవడం రాముడికి కూడా ఇష్టం లేదని విమర్శించారు. చంద్రబాబో.. నితీశ్ కుమారో మారితేనే కేంద్ర ప్రభుత్వమే గందరగోళంలో పడుతుందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నదని కడియం అన్నారు. బీజేపీకి ఓటింగ్ శాతం కూడా తగ్గిందని, కానీ, కాంగ్రెస్ కూటమికి 7 శాతం ఓటింగ్ పెరిగిందని వివరించారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరిగిందని చెప్పారు. అలాగే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి తాను వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తన పార్టీ మార్పును ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే అనుమానం ఉండేదని, కానీ, ప్రజలు తన పార్టీ మార్పును స్వాగతించారని వివరించారు. స్టేషన్ ఘన్పూర్ ప్రజలు తనకు అండగా నిలిచారని చెప్పారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 56 వేల మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయని తెలిపారు.
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో 8 కాంగ్రెస్, 8 బీజేపీ, ఒక్క సీటు ఎంఐఎం కైవసం చేసుకున్నాయి. బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. కాగా, కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య మంచి మెజార్టీతో వరంగల్ లోక్ సభ స్థానంలో గెలిచారు.