– 18 గంటలు పని చేయడం తప్పా?
– అన్ని హామీలూ అమలు చేసి చూపిస్తాం
– కేసీఆర్ కుట్రలు ఇక చెల్లవు
– కరెంటు అక్రమాలపై ఎంక్వైరీ కోరింది వారే
– వలసలపై మాట్లాడే హక్కు కేసీఆర్కు ఉందా?
– ఫిరాయింపులకు ఆద్యుడు ఆయనే
– బీఆర్ఎస్ పతనం స్వయంకృతమే
– మా ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా?
– కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే
– త్వరలోనే టీపీసీసీకి కొత్త సారథి
– జీవన్ రెడ్డి నిబద్ధత కలిగిన నేత
– హస్తినలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి
KCR: పదేళ్లపాటు అధికారాన్ని అనుభవించి, పదవి పోగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆదిలోనే కుట్రలు చేశారు. మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే కూలిపోతుందని కేటీఆర్, హరీశ్ రావు శాపనార్థాలు పెట్టారు. వీరికి ఆనాడు బీజేపీ కూడా వంతపాడింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు 16 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీతో చేతులు కలిపారనే సంగతి ఆ పార్టీ కంచుకోటలుగా చెప్పుకునే సిరిసిల్ల, సిద్ధిపేటలో బీజేపీకి వచ్చిన ఓట్లను బట్టే వారి మ్యాచ్ ఫిక్సింగ్ అర్థమైపోయింది.
వలసలపై ఎందుకీ రాద్ధాంతం
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి పలువురు నేతలు మా పార్టీలోకి వస్తున్నారు. దీనిని కేసీఆర్ ఫిరాయింపులుగా చిత్రీకరిస్తున్నారు. ఫిరాయింపులపై కేసీఆర్ మాటలు, వంద ఎలుకలను తిన్న పిల్లి మాటల చందాన ఉన్నాయి. 2014 నుంచి 61 మంది వేరే పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేసీఆర్ తమ పార్టీలో చేర్చుకున్నారు. ప్రజలు తగినంత మెజారిటీ ఇచ్చినా, రాజకీయ ఏకీకరణ పేరుతో ఫిరాయింపులను ప్రోత్సహించారు.
పీసీసీ ఎన్నికపై క్లారిటీ
పీసీసీ అధ్యక్షుడిగా గడిచిన మూడేళ్ల కాలంలో అందరితో కలిసి పనిచేశాను. నా పదవీ కాలం ముగిసినందున త్వరలో కొత్త పీసీసీ చీఫ్ను నియమించాలని హై కమాండ్కు చెప్పా. సమర్థవంతమైన నాయకుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని, కొత్త నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడాలి.
జగిత్యాల కథ సుఖాంతం
కాంగ్రెస్ చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ పార్టీలో చేరారు. దీనిని కొందరు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో నిబద్ధత గల నాయకుడైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మా పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు. చిన్న సమాచార లోపంతో కాస్త గందరగోళం తలెత్తినా, అంతా సద్దుమణిగింది. రైతుల కోసం ఎంతో చేసిన అనుభవం ఉన్న జీవన్ రెడ్డి, సేవలను తెలంగాణ కాంగ్రెస్ వినియోగించుకుంటుంది.
పాలనపై ఫోకస్
లోక్సభ ఎన్నికలు ముగిసినందున తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ప్రజా పాలన మీద దృష్టి సారించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు మా నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు త్వరలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం. శాంతి భద్రతల మీద పూర్తిగా పట్టుసాధించాం. అందుకే, ఇటీవలి ఎన్నికల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదు. కేబినెట్ విస్తరణకు ఇంకా మహూర్తం ఖరారు కాలేదు. నిర్ధిష్టమైన ప్రణాళికలతో రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా మా సర్కారు ముందుకు సాగుతుంది.