– ఓవర్ లోడ్తో వెళ్తే మంత్రికి సమ్మతమా?
– నోటీసులతో ఇల్లీగల్ యాక్టివిటీని కప్పిపుచ్చలేరు
– 26న జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయానికి మంత్రి వస్తారా?
– డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తారా?
– బ్లాక్ బుక్ రెడీ చేస్తున్నా
– నోటీసులపై స్పందించిన కౌశిక్ రెడ్డి
Ponnam prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ తనకు లీగల్ నోటీసులు పంపించారని, అందుకు బరాబర్ సమాధానం చెబుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వాళ్లు జీఎస్టీ వే బిల్లు అని మాట్లాడుతున్నారని, తాను జీఎస్టీ వే బిల్లు అడగలేదని.. వెయిట్ వేబిల్లును అడుతున్నానని చెప్పారు. ఈ రోజు కూడా ఫ్లైయాష్ ట్యాంకర్లు ఓవర్ లోడ్తో వెళ్లుతున్నాయని, ఇప్పుడు వెళ్లి చూసినా ఓవర్ లోడ్తో వెళ్లే ట్రక్కులు కనిపిస్తాయని తెలిపారు. ఓవర్లోడ్తో వెళ్లితే రోడ్లు ధ్వంసం కావడంతోపాటు ఫ్లై యాష్ పడి ప్రమాదాలు కూడా జరుగుతాయని పేర్కొన్నారు. అనుమతులకు మించిన లోడ్తో వెళ్లితే రవాణా శాఖకు మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ డబ్బులు తీసుకున్నాడని ఆరోపిస్తూ సవాల్ విసిరారు. అపోలో హాస్పిటల్లోని బాలాజీ టెంపుల్కు బుధవారం ఉదయం 11 గంటలకు ఆలయానికి రావాలని, డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయాలని అన్నారు. ఒక వేళ ఆయన రాకుంటే మరిన్ని విషయాలు బయటపెడతానని పేర్కొన్నారు.
అవ్వా తాతలకు పెన్షన్లు రెట్టింపు చేస్తామని, వికలాంగులకు పింఛన్ రెండు వేలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆరు నెలలైనా ఆ హామీలను అమలు చేయడం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పారని, ఇప్పుడు ఆరు నెలలు దాటినా ఇవ్వడం లేదని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. వారు ఇస్తామని అదనపు పింఛన్ పక్కన పెడితే తమ హయాంలో ఇచ్చిన మేరకైనా పింఛన్ రెగ్యులర్గా ఇవ్వడం లేదని, ఈ ఆరు నెలల్లో మూడు నెలలు మాత్రమే పింఛన్ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా పెంచిన పింఛన్ను డిసెంబర్ నెల నుంచి లెక్కించి మిగిలిన బకాయిలను అర్హులందరికీ పంచాలని కోరారు.
తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతున్నదని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయాలని జీవో ఉన్నప్పటికీ.. అధికారులనే నేరుగా లబ్దిదారులకు అందించాలని ప్రభుత్వం చెబుతున్నదని తెలిపారు. ఏకంగా ఎమ్మార్వోను మంత్రి పొన్నం ప్రభాకర్ బెదిరించారని చెప్పారు. కళ్యాణ లక్ష్మీ చెక్కుల గడువు ఈ నెలలో ముగియనుందని, అయినా ఇంకా ఎందుకు వాటిని పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డబ్బులతోపాటు తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు తన చేతుల మీదుగా చెక్కుల పంపిణీ జరిగితే తులం బంగారం ఎక్కడుందని ప్రశ్నిస్తానని భయపెడుతున్నారా? అని ఎద్దేవా చేశారు.
ప్రోటోకాల్ ఉల్లంఘనకు అధికారులకు సహకరిస్తే తాము అధికారంలోకి వచ్చాక సహించబోమని, ఇప్పటికే అలాంటి వారి పేర్లను తన బ్లాక్ బుక్లో రాస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వస్తుందని, రూల్స్ పాటించకుండా అధికార పార్టీకి అనుకూలంగా నడుచుకునే అధికారులపై యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
కొంత మంది తమ పార్టీ ఎమ్మెల్యేలు మారుతారని జోస్యం చెబుతున్నారని, నలుగురు దొంగలు పోతే పార్టీ ఆగిపోదని అన్నారు. తమకు 34 ఎమ్మెల్యేలు, 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నారని, వేలాది మంది పార్టీ నేతలూ ఉన్నారని వివరించారు. బలమైన నాయకుడు కేసీఆర్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలిచి తీరుతుందని తెలిపారు. పార్టీ మారిన నాయకుల లొసుగులు తమకు తెలుసు అని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరినీ వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.