BRS Party: పోచారం శ్రీనివాసరెడ్డి లక్ష్మీపుత్రుడు కాదని, లంక పుత్రుడని బీఆర్ఎస్ లీడర్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీలో అనేక రకాలుగా లబ్ది పొంది, అనేక పదవులు అనుభవించి.. ఇప్పుడు ఊసరవెల్లిలా పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారారాని ఆగ్రహించారు. రైతుల కోసం కాదు.. రాళ్ల కోసం, ఇసుక కోసం పోచారం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాడని పేర్కొన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డే ఆయనను ఎన్నికల్లో దూషించారని చెప్పారు.
తెలంగాణ భవన్లో మీడియాతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారిందని రైతుల కోసం కాదని, రాళ్ల కోసం, ఇసుక కోసమేనని అన్నారు. అంతేకాదు, రాజీనామా చేయకుండా పార్టీ మారే ఎమ్మెల్యేకు ప్రజలు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన పోచారం శ్రీనివాసరెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు త్వరలోనే ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. త్వరలో బాన్సువాడలో ఉపఎన్నిక వస్తుందని, అందులో బీఆర్ఎస్ గెలుస్తుందని వివరించారు.