– సింగరేణిపై బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు
– కేంద్రంతో కుమ్మక్కైన సీఎం రేవంత్
– తెలంగాణ భవన్లో కేటీఆర్ మీటింగ్
– సింగరేణి మీటింగ్కి ఆ ముగ్గురు నేతల డుమ్మా
– వలసల వేళ.. గైర్హాజరుపై అనుమానాలు
Telangana: లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టేందుకు కేంద్రంలోని మోదీ, సీఎం రేవంత్ ఒక్కటై కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో గురువారం ఆయన తెలంగాణ భవన్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే తెలంగాణ బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసిందని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అందుకే సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తూ, చివరికి దీనిలోని ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ కోసం రంగం సిద్ధం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మె కారణంగా సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించిందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతమే మన పార్టీ విధానమని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
తట్టెడు బొగ్గు ఎత్తనీయలే..
బీఆర్ఎస్ పాలనలో సింగరేణి అభివృద్ధి, విస్తరణ కోసం పనిచేశామని, ఈ కాలంలో తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయకుండా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చామన్నారు. కేంద్రం బలవంతంగా రెండు బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు కేటాయించినప్పటికీ.. తట్టెడు తెలంగాణ బొగ్గును ఎత్తకుండా ఆపిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. నేడు సింగరేణి ప్రైవేటీకరణ జరుగుతుంటే తాము చూస్తూ ఊరుకోబోమని, ఆరునూరైనా సంస్థను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. పార్లమెంటులో తమకు బలం లేదని భావించి సింగరేణిపై కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని, కానీ వారి కుట్రలను తిప్పికొడతామన్నారు.
ఆ ముగ్గురూ డుమ్మా..
సింగరేణి అంశంపై గురువారం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశానికి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావుతో బాటు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డుమ్మా కొట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోవటంతో ఈ ముగ్గురు నేతలు మౌనంగా ఉంటున్నారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్లోకి వలసలు ఊపందుకున్న వేళ.. సింగరేణి బెల్ట్ ప్రాంతంలోని సీనియర్ నేతలుగా గుర్తింపుపొందిన వీరు మీటింగ్కు గైర్హాజరు కావటం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది.