Suresh Gopi: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటు లోపలా బయట కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతుంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు పార్లమెంటులో జవహర్లాల్ నెహ్రూపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దిగ్గజ నాయకులు ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందినవారిని బీజేపీ నాయకులు కీర్తించడం అరుదు. కానీ, ఏకంగా కేంద్రమంత్రి.. ఇందిరా గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు.
కేరళ నుంచి తొలిసారిగా బీజేపీ టికెట్ పై గెలిచిన ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు సురేష్ గోపీ.. ఇందిరా గాంధీ గురించి మాట్లాడారు. ఎవరికి నచ్చినా.. నచ్చకున్నా.. కేరళలో కాంగ్రెస్ పార్టీకి తండ్రిలాంటి నాయకుడు కే కరుణాకరణ్ అని, దేశంలో చూసుకుంటే తల్లివంటిది ఇందిరా గాంధీ అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తన మనస్పూర్తిగా చెప్పినట్టు వివరించారు. ‘స్వతంత్ర భారత దేశ నిజమైన నిర్మాత ఇందిరా గాంధీ. ఆమె మరణించే వరకూ దేశ నిర్మాణంలోనే ఉన్నారు. ఆమె కృషిని తప్పక చెప్పాల్సిందే. దేశం కోసం నిబద్ధతతో పని చేసిన ఒక వ్యక్తిని.. కేవలం ప్రత్యర్థి పార్టీకి చెందినవారని విస్మరించలేను’ అని సురేష్ గోపి తెలిపారు. అలాగే.. తాను దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీని దేశానికి తల్లి అని చెప్పలేదని, మీడియా తప్పుగా చిత్రించిందని స్పష్టత ఇచ్చారు.
భారత రాజకీయ చరిత్రలో ఇందిరా గాంధీ, కే కరుణాకర్ను ముఖ్యమైన నాయకులు అని కేంద్రమంత్రి సురేష్ గోపీ శనివారం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇందిరా గాంధీ మదర్ ఆఫ్ ఇండియా అని, కే కరుణాకరణ్ ఒక ధైర్యవంతుడైన పాలకుడు అని అభివర్ణించినట్టు కథనాలు వచ్చాయి. తాజాగా.. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని స్పష్టత ఇచ్చారు.
కేరళలోని త్రిస్సూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సురేష్ గోపి గెలుపొందారు. కేరళ రాష్ట్రంలో బీజేపీకి ఇదే బోణి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ మధ్య గట్టి పోటీ జరిగింది. చివరికి బీజేపీ అభ్యర్థి సురేష్ గోపీ విజయాన్ని కైవసం చేసుకున్నారు.