- జులై మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- ఎన్నికల ముందు ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కార్
- పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు
- రైతుబంధు, రుణమాఫీ అంశాలపై చర్చ
- ధరణి సమస్యలపై ఫోకస్
- కేంద్ర బడ్జెట్ పూర్తయ్యాకే రాష్ట్ర బడ్జెట్
- కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర కేటాయింపులపై ఉత్కంఠ
- రాష్ట్ర ఆదాయం పెంచే వనరులపై కీలక నిర్ణయాలు
Telangana state assembly sessions may be july first week Budget :
జులై మొదటివారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదలు కానున్న ఈ సమావేశాలు పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది.ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్ స్థానంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంతో పాటు తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పు, రైతు బంధు, రుణమాఫీ తదితర అంశాలు అసెంబ్లీ సమావేశాలలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక గత సర్కార్ పాలనలో అనేక ఆరోపణలు వచ్చిన ధరణి సమస్యలపైనా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఈ అసెంబ్లీ సమావేశాలలో ధరణి పేరు మార్పు అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే భూమాత అనే పేరును నామమాత్రంగా సూచించారు.
పూర్తి స్థాయి బడ్జెట్ పై కసరత్తు
ఫిబ్రవరిలో జరిగిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలలకు సరిపడ బడ్జెట్ పద్దులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నాలుగు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరం అయిన నిధుల ను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం ఈనెలలోనే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులను ఆధారంగా చేసుకుని ఈ ఆర్థిక సంవత్సరం లో మిగిలిన 8 నెలలకు అవసరం అయిన బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.
రుణమాఫీ, భరోసా
రైతు భరోసా, రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో కట్ ఆఫ్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో వ్యవసాయం చేయని వారికి వేల ఎకరాలు ఉన్న వారికి కొండలు ,రోడ్లు ఉన్న భూములకు రైతు బంధు ఇచ్చారని అధికార పార్టీ విమర్శలు చేస్తుంది.. ఈ నేపథ్యంలో రైతుభరోసా కింద నిజమైన సాగుదారులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఐదు ఎకరాల వరకు సీలింగ్ పెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే వారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం అయి రైతులను ఇచ్చే పంట సహాయం ,రుణమాఫీపై కట్ ఆఫ్ పెట్టనుంది ప్రభుత్వం.
పలు కీలక నిర్ణయాలు
కౌలు రైతులకు సైతం పంట పెట్టుబడి సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై నిర్ణయం ప్రకటించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. వీటితో పాటు పాలనలో సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి పారుదల రంగాల్లో పారదర్శకత ,జవాబుదారీతనం పెంచే విధంగా చర్యలు తీసుకుంటుంది..అందులో బాగంగా మొదట విద్య, వ్యవసాయ రంగాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం విద్య కమీషన్, రైతు కమీషన్ లను ఏర్పాటు చేస్తుంది .వీటితో పాటు తెలంగాణ తల్లి ,తెలంగాణ చిహ్నంపై చర్చ జరుగనుంది..మొత్తం గా ఈసారి బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతుంది.సమావేశాలు ఇంకా ఎలాంటి అజెండా తో నిర్వహించనున్నారో వేచి చూడాలి.