Hyderabad rain water sending through sumps solutions from floods:
హైదరాబాద్ నగరం పేరుకు విశ్వనగరం..వానొస్తే నరకం. కొద్దిపాటి వానస్తే చాలు మెయిన్ రోడ్డలలో నీరు నిలిచిపోతుంది. దీనితో వాహనదారులు నానా యాతన పడుతున్నారు. గత ప్రభుత్వాలు ఈ సమస్యపై ఏనాడూ దృష్టి పెట్టకపోవడంతో వానాకాలంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతన్నాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ఖరీదైన వస్తువులన్నీ పాడైపోతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. అయితే తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇకపై ఈ సమస్యలకు పరిష్కారం లభించనుంది. జీహెచ్ఎంసీ అధికారులు దీనిపై కార్యాచరణ సిద్ధం చేశారు. నెల రోజుల వ్యవధిలో దీనికి సంబంధించిన పనులను పురపాలక శాఖ ఆధ్వర్యంలో బల్దియా అధికారులు మొదలు పెట్టి పూర్తి చేయబోతున్నారు. వర్షాలతో చెరువులుగా మారే ప్రాంతాల్లో దానికి సమాంతరంగా పెద్ద సంపు తవ్వి అందులోకి మళ్లించే ఏర్పాటు చేయనున్నారు. ఈ సంప్ నుంచి నీటిని మోటార్లు ద్వారా సమీపంలోని అతిపెద్ద నాలాలకు తరలిస్తారు.
టెండర్లకు ఆహ్వానం
ఏకధాటిగా 2సెం.మీ.ల వర్షం పడితే చాలు దాదాపు 50చోట్ల చెరువుల్లా మారుతున్నాయి. ఇందులో 20 వరకు ప్రధాన ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలుస్తోంది. మొదటి దశలో 12 చోట్ల సంపులు నిర్మించాలని నిర్ణయించారు. పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఈ నెలాఖరుకే పనులు పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
సంపుల ఏర్పాటు
హైదరాబాద్ నుంచి శంషాబాద్ వెళ్లే మార్గంలో పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే కింది భాగంలో పిల్లర్ నంబర్ 264 శివరాంపల్లి దగ్గర భారీ వర్షం పడితే ఈ ప్రాంతం చెరువుగా మారుతోంది. రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా దీనికి సమీపంలోని ప్రభుత్వ స్థలంలో 1.50లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపును నిర్మించనున్నారు. ఈ నీటిని వెంటవెంటనే మోటార్ల ద్వారా బుల్కాపూర్ నాలాలోకి తరలిస్తారు.హుస్సేన్సాగర్ చుట్టూ నీరు నిల్చే ప్రాంతాల్లోనూ ఇలాగే సంపుల నుంచి సాగర్లోకి పంపించనున్నారు.రాజ్భవన్ రోడ్డులోని లేక్ క్యూ అతిథి గృహం దగ్గర సంపును తవ్వబోతున్నారు. మొదటి దశ పనులు పూర్తయిన తరువాత రెండో దశలో మరికొన్నిచోట్ల నిర్మించాలని నిర్ణయించారు.