BJP MLA: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్ చేరుకోగానే శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. మెదక్ పట్టణానికి వెళ్లుతున్న రాజాసింగ్ను పోలీసులు శాంతి భద్రత కారణాల రీత్యా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రాజాసింగ్ను మియాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మెదక్లో జరిగిన ఘర్షణల్లో గాయపడ్డ వారిని పరామర్శించారు.
బక్రీద్ సందర్భంగా పశువులను తరలిస్తుండగా గోరక్షకులు తనిఖీలు చేశారు. ఆవులను తరలిస్తున్నారనే ఆరోపణలతో అలర్లు చెలరేగాయి. ఇందులో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరగ్గా.. బీజేవైఎం, హిందూ సంఘాలకు చెందిన ఓ యువకుడు గాయపడ్డాడు. కత్తిపోటు దాడికి గురికావడంతో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ ఘటన గురించి ఢిల్లీలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుసుకున్నారు. ఈ ఘటనపై సీరియస్గా స్పందించారు. రాష్ట్రంలో గోవధ నిషేధం ఉన్నప్పటికీ.. అక్రమంగా గోవులను తరలించేవారిని అడ్డుకుని చట్టం అమలుకు తోడ్పడిన వారిపై దాడి జరిగిందని ఆగ్రహించారు. పోలీసులు వెంటనే ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అల్లరి మూకల దాడిలో గాయపడినవారిని పరామర్శించడానికి తాను ఆదివారం మెదక్కు వస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
రాజాసింగ్ మెదక్కు వెళ్లితే అసలే ఉద్రిక్తతలు నెలకొన్న ఆ ఏరియాలో అల్లర్లు చెలరేగే ముప్పు ఉన్నదని, పరిస్థితులు మరింత జఠిలం అయ్యే ప్రమాదం ఉన్నదని పోలీసులు రంగంలోకి దిగారు. శాంతి భద్రతల కారణాల రీత్యా రాజాసింగ్ను.. ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను మియాపూర్ హాస్పిటల్ తరలించారు. అక్కడ మెదక్ అల్లర్లలో గాయపడ్డవారిని రాజాసింగ్ పరామర్శించారు.