warangal
క్రైమ్

Warangal: శృతిమించుతున్న అక్రమార్కులు.. మాజీ కార్పొరేటర్‌ దౌర్జన్యం

Land Grabbing: వరంగల్ జిల్లాలో అక్రమార్కుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతున్నది. కన్నుపడితే కబ్జా చేద్దామన్నట్టుగా కబ్జారాయుళ్లు రంకెలు వేస్తున్నారు. అమాయకులు కనపడితే చాలు బెదిరించడమో.. దౌర్జన్యానికి దిగడమో చేసి భూమి లాక్కుంటున్నారు. ఆ భూమిలో పాగా వేస్తున్నారు. బాధితులు కొంత ధైర్యం చూపి పోలీసులను ఆశ్రయిస్తే విషయం వెలుగులోకి
వస్తున్నది. ఇలాంటి ఘటనే ఒకటి వరంగల్‌లో వెలుగులోకి వచ్చింది. తమ ప్రతాపం చూపి ఓ ఇంటి నిర్మాణం వద్ద దౌర్జన్యానికి దిగిన మాజీ కార్పొరేటర్ సహా ఐదుగురిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.

వరంగల నగరంలోని అండర్ రైల్వే గేటుకు చెందిన ఓ మాజీ కార్పొరేటర్ కత్తేరసాల వేణుగోపాల్, మరో ముగ్గురు నిందితులపై మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉరుసుగుట్ట సమీపంలోని సర్వే నెంబర్ 484/ ఎఫ్/ ఏలో గల లక్కం సురేష్‌కు సంబంధించిన 466 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాడు. గత నెల 29వ తేదీన మధ్యాహ్నం ఈ ఇంటిలోకి నిందితులు అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యం చేశారు. నిర్మాణంలో ఇంటిని కూల్చివేసే ప్రయత్నం చేశారు. అక్కడ పని చేస్తున్న లేబర్ పైనా దాడికి దిగారు.

Also Read: రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ.. నామినేషన్ దాఖలు

ఈ దాడి ఘటన సమీపంలోని ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియో బయటికి వచ్చింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించి భోరుమన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. దాడికి పాల్పడ్డ బుడిగ చిట్టిబాబు, మినుముల భాస్కర్, మాజీ కార్పొరేటర్ కత్తేరసాల వేణుగోపాల్‌, పసుల రాజ్ కుమార్‌లపై కేసు నమోదు చేశారు. ఇలాంటి అక్రమార్కుల చెర నుంచి అమాయకులను కాపాడాలని నగర ప్రజలు పోలీసులను కోరుతున్నారు.