BRS Ex MLA Jeevan Reddy
Politics

TSRTC: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఆర్టీసీ షాక్.. మాల్ అండ్ మల్టిప్లెక్స్ భవనం స్వాధీనం

Jeevan Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి టీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చింది. ఆర్టీసీ స్థలంలోని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టిప్లెక్స్ భవనాన్ని గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకుంది. అద్దె బకాయిలు చెల్లించాలని పలుమార్లు నోటీసులు పంపినా పూర్తిగా బకాయలు చెల్లించకపోవడంతో అద్దె ఒప్పందాన్ని ఆర్టీసీ రద్దు చేసుకుంది. ఈ రోజు సాయంత్రం ఆ భవనాన్ని టీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టే స్టేషన్ సమీపంలోని ఆర్టీసీకి చెందిన 7059 చదరపు గజాల భూమిని 33 సంవత్సరాలకు విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ కంపెనీ బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ కింద 2013 జూన్ 1న లీజుకు తీసుకుంది. 2017లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితా రెడ్డి టేక్ ఓవర్ చేసుకున్నారు. ఆ షాపింగ్ మాల్‌కు జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్లిప్లెక్స్ అని పేరు పెట్టారు. అందులోని స్టాళ్లు థర్డ్ పార్టీలకు లీజుకు ఇచ్చారు.

ఇదంతా పక్కనపెడితే ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ ఆర్టీసీ సంస్థకు సకాలంలో అద్దె చెల్లించాలి. కానీ, కొన్ని నెలలుగా చెల్లించలేదు. గతేడాది అక్టోబర్ వరకు అద్దె రూపకంగా ఆర్టీసికి రూ. 8.65 కోట్లు వారు బకాయి పడ్డారు. అద్దె చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో ఆ కంపెనీ అక్టోబర్‌లో రూ. 1.50 కోట్లు చెల్లించింది. అనంతరం షోకాజ్ నోటీసులు పంపడంతో గతేడాది డిసెంబర్‌లో విడతల వారీగా రూ. 2.40 కోట్లను కట్టింది. అంతేకాదు, ఆ షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఆర్టీసికి బకాయిలు చెల్లించాల్సిందేనని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో విడతల వారీగా రూ. 2 కోట్లు చెల్లించారు. బకాయిలన్నీ నెల రోజుల్లో చెల్లించాలని మార్చి 27న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇది ప్రజల డబ్బు అని, బకాయిలు చెల్లించకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సంస్థను ఆదేశించింది.

Also Read: రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ధర్నా

నెల రోజుల గడువు ముగిసినా బకాయిలను మాత్రం ఆ కంపెనీ చెల్లించలేదు. ఇంకా రూ. 2.51 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టు ఉత్తర్వులు, అద్దె ఒప్పంద నిబంధనల ప్రకారం విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి భవనాన్ని టీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.