Telangana Schemes: తెలంగాణలో సొంతిల్లు లేని పేదలకు నీడ ఏర్పరచేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు రంగం సిద్ధం చేసింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈరోజు (మార్చి 11న) పినపాక నియోజక వర్గంలోని మణుగూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ఈ పథకం కింద లబ్ధిదారులకు నాలుగు దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం ఆధార్ కార్డు ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. ఇప్పటివరకు ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 82 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. 2004-2014 మధ్యకాలంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదల కోసం తెలంగాణ ప్రాతంలో దాదాపు 19 లక్షల ఇళ్లు కట్టించగా, ఇంకా తెలంగాణలో నీడకు నోచుకోని పేదలకు రేవంత్ సర్కారు అండగా నిలవనుంది.
119 నియోజకవర్గాలు, 4,16,500 ఇళ్లు
ముందుగా, తొలి దశలో స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. దీన్ని రాయితీ రూపంలో లబ్ధిదారుడికి అందజేయనుంది. స్థలం లేనివారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అంతే మొత్తాన్ని అందిస్తారు. ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఏడాదికి 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. దీనికి సంబంధించిన గైడ్లైన్స్నూ ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం హడ్కో నుంచి రూ.3,000 కోట్ల రుణం తీసుకుంది. ఈ రుణం పొందేందుకు హడ్కో పేర్కొన్న షరతులను అంగీకరించేందుకు హౌసింగ్ బోర్డుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో రుణానికి తెలంగాణ సర్కార్ గ్యారంటీ కూడా ఇచ్చిన సర్కారు, ఈ మేరకు బడ్జెట్లో నిధులు కూడా ప్రభుత్వం కేటాయించింది.
మార్గదర్శకాలు
లబ్ధిదారుడు విధిగా దారిద్య్ర రేఖ( బిపిఎల్)కు దిగువన ఉన్న వారై ఉండాలి. రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని గుర్తిస్తారు. అర్హులకు సొంత స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి. వారు గ్రామం లేదా పురపాలిక పరిధిలోని వారై ఉండాలి. గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా అర్హులు అవుతారు. అద్దె ఇంట్లో ఉంటున్నా ఈ పథకానికి అర్హత పొందవచ్చు. వివాహమైనా ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావొచ్చు. ఒంటరి మహిళలు కూడా లబ్ధిదారులే. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు దశల్లో ఆర్థిక సహాయం అందజేయనుంది. బేస్మెంట్ స్థాయిలో రూ.లక్ష, పైకప్పు (రూప్) స్థాయిలో రూ.లక్ష సాయం చేయనుంది. పైకప్పు నిర్మాణం తరువాత రూ.2 లక్షలు, నిర్మాణం పూర్తయ్యా క రూ.లక్ష ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనుంది. లబ్ధిదారుల ఎంపిక సమయంలో, తర్వాత, ఇళ్ళ నిర్మాణ సమయంలో అధికారులు వచ్చి పర్యవేక్షిస్తుంటారు. ఎక్కడైనా సమస్యలు, లోపాలు, అవకతవకలుంటే తగు చర్యలు తీసుకొంటూ ఇళ్ళ నిర్మాణం వేగంగా పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు సాయపడతారు.
మహిళల పేరిట
ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు మహిళలున్నా అమె పేరిట కూడా ఇల్లు అందుతుంది. గ్రామ, వార్డుసభల్లో ఆమోదం పొందిన తరవాత లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో ప్రదర్శించాక సమీక్షించి, ఖరారు చేస్తారు. జిల్లాల్లో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తాయి. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్, బాత్రూం ప్రత్యేకంగా ఉండాలి. ఆర్సీసీ రూఫ్తో ఇంటిని నిర్మిస్తారు.