– కొచ్చి విమానంలో సాంకేతిక లోపం
– ఫ్లైట్లో మంత్రి పొంగులేటి సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
– చాలాసేపు రన్ వే పైనే ఆగిపోయిన విమానం
– కాంగ్రెస్ నేతలతో కనిపించిన బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి
– మళ్లీ హస్తం గూటికి చేరుతున్నారా?
– గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ గూటికి చేరిన రోహిత్ రెడ్డి
Khammam: తెలంగాణ లోక్ సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అయితే, పోలింగ్ జరిగిన మరుసటి రోజే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో కేరళ టూర్కు వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. ఇండిగో 6ఏ 6707 విమానంలో వీరంతా మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కొచ్చి బయల్దేరారు. కానీ, విమానంలో సాంకేతిక సమస్య కారణంగా దాదాపు గంటపాటు టేకాఫ్ కాకుండా రన్ వే పైనే నిలిచిపోయింది. తర్వాత టేకాఫ్ తీసుకుని తిరిగి వెనక్కి వచ్చేసింది. అయితే, ఎయిర్లైన్స్ సిబ్బంది వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ సహా పలువురు నాయకులు ఉన్నారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇదే ఫ్లైట్లో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. లోక్ సభ ఎన్నికలు ముగియగానే జిల్లా నేతలు కేరళకు వెళ్లడం చర్చనీయాంశం అయింది. అందులోనూ బీఆర్ఎస్ నాయకుడు ఉండటం మరింత ఆసక్తికర పరిణామంగా మారింది.
Also Read: కవితకు షాక్.. మరో ఆరు రోజులు జైలులోనే..
అసెంబ్లీ ఎన్నికల ఒత్తిడి, ఆ వెంటనే, లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ నాయకులు శ్రమించారు. ఈ నేపథ్యంలోనే వీరంతా కలిసి సేద తీరాలనే ఉద్దేశంలో కేరళకు వెళ్తున్నారనే చర్చ జరుగుతున్నది. అయితే, కాంగ్రెస్ నాయకులతో బీఆర్ఎస్ నేత ఉండడం జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. రోహిత్ రెడ్డి 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. మొన్నటి ఎన్నికల్లో కారు గుర్తుపైనే పోటీ చేసినా కాంగ్రెస్ హవాలో కొట్టుకుపోయారు. ఇప్పుడు ఒకే ఫ్లైట్లో పొంగులేటి, పైలట్ కనిపించడం ఆసక్తికరంగా మారింది. మళ్లీ ఈయన పార్టీ మారుతున్నారా? అనే చర్చ జరుగుతోంది.