Chandrababu naidu meeting with Revanth reddy: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ నెల 6న ప్రజాభవన్ను భేటీ కానున్నారు. కాగా, ఈ నేపథ్యంలో ప్రజా భవన్ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంతకుమారి పరిశీలించారు. ఈ నెల 6న తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజా భవన్లో భేటీ కానుండగా.. వేదికకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే దగ్గర ఉండనున్న నేపథ్యంలో సెక్యూరిటీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పీఎస్ శాంతికుమారికి ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక సూచనలు తెలియజేశారు.
భేటీ జరుగుతున్న సమయంలో ప్రజాభవన్కి చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రత పెంచాలని నిర్ణయించారు. ప్రజాభవన్లోకి వచ్చే విజిటర్స్కు సైతం అనుమతి నిరాకరించనున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యలపై సమగ్రంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమనిధి, వాణిజ్యపన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలు, 23 కార్పొరేషన్ల ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండగా చర్చల అనంతరం వీటన్నింటి పరిష్కారాని ఇద్దరు ముఖ్యమంత్రులు తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.