– ఈవీఎంల పనితీరుపై సీఎం రేవంత్ ప్రశ్నలు
– మోడీ గెలుపు తీరుపై సందేహాలు
– అగ్ర దేశాలలోనూ ఈవీఎంల పనితీరుపై అపనమ్మకం
– కష్టసాధ్యం కాదంటున్న సైబర్ నిపుణులు
– 6.5 లక్షల ఈవీఎం, వీవీప్యాట్స్లో లోపాలున్నాయా?
– ఈవీఎంల ట్యాంపరింగ్పై బహిరంగంగా ప్రదర్శనలు
– కొట్టిపడేస్తున్న ఎన్నికల అధికారులు
– ఆలోచింపజేస్తున్న రేవంత్ రెడ్డి మాటలు
Fact Check Video Clip Of EVM Controversy From 7 Years Ago Resurfaces Linked To 2024: పార్లమెంట్ ఎన్నికల వేళ ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటున్న అంశం ఈవీఎంల పనితీరు. ప్రతి ఎన్నికల వేళ ఈవీఎంల గురించి ఈ చర్చ వస్తూనే ఉంది. అయితే, ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఈ అంశాన్ని చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఈవీఎంల పనితీరు వాటి విశ్వసనీయతపై కామన్ పీపుల్తో సహా మేధావులు సైతం గతంలో చాలా సందేహాలు వ్యక్తం చేశారు. ట్యాంపరింగ్ పెద్ద కష్టం కాదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అవకాశం ఇస్తే ప్రూవ్ చేస్తామంటున్నారు. ఇదే క్రమంలో ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
రేవంత్ వ్యాఖ్యలు ఇవే!
ఎన్నికలు జరిగే ప్రతిసారీ మోడీ ఎందుకు గెలుస్తూ వస్తున్నారు, అందుకు కారణం ఈవీఎంలే అని అన్నారు రేవంత్. మోడీ ఏ నెంబర్ నొక్కితే అదే వస్తుందని చెప్పారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు పెడదాం అంటే మోడీ, బీజేపీ ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు. మోడీ, ఈవీఎంలు ఉన్నన్ని రోజులు మీకు అధికారం దక్కదని సెంట్రల్ హాల్లో బీజేపీ నేతలే స్వయంగా చెబుతున్నారన్నారు. ఈవీఎం మోడీ చోటా భాయ్ కాదు కదా ఎందుకు వదలడం లేదని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం పేపర్ బ్యాలెట్తోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని.. కేవలం మన దేశంలోనే ఈవీఎంలు వినియోగిస్తున్నారని రేవంత్ అన్నారు. ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం పోయిందని, వాటిపై బీజేపీకి మాత్రమే నమ్మకం ఉందని చెప్పారు. బీజేపీ నమ్మకంతో ఈ దేశానికి పనిలేదని ప్రజల నమ్మకమే తమకు ముఖ్యమన్నారు. వారి ఆకాంక్షల మేరకు ఈవీఎంలతో ఎన్నికలు జరిపితే నీళ్లు ఏవో పాలు ఏవో తేలిపోతుందని చెప్పారు.
Also Read: నూతన సచివాలయం..వసతులు లేక సతమతం
అసలు, ఈవీఎంల విశ్వసనీయత ఎంత?
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, స్మార్ట్ లావాదేవీలు, డిజిటల్ సాధనాలు వాడే సంపన్న దేశాలు సైతం ఈవీఎంలను కాదని బ్యాలెట్ పత్రాలకు మారడానికి ట్యాంపరింగ్ వ్యవహారమే కారణమని ఎథికల్ హ్యాకింగ్ నిపుణులు చెప్తున్నారు. ఈవీఎంలలో ఉండే చిప్లను మార్చడం పెద్ద కష్టమైన పనికాదని, వాటిని తయారు చేయడం దగ్గర నుంచి పోలింగ్ కేంద్రాలకు చేర్చేవరకూ ఏ క్షణమైనా, ఎలాగైనా ట్యాంపరింగ్ చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈవీఎం చిప్లో ఉండే సోర్స్ కోడ్ను మార్చడం ద్వారా ఫలితాలను ప్రభావితం చేయవచ్చని అంటున్నారు. అయితే, ఈవీఎంలలోని చిప్ను తొలగించాలని ఎవరైనా ప్రయత్నిస్తే అది లోలోపలే కాలిపోతుందని ఈసీ అధికారులు చెప్తున్నారు. చిప్లోకి కొత్త ప్రోగ్రామ్ను ఇంజెక్ట్ చేస్తే ఎలాగన్న దానిపై వివరణ ఇవ్వట్లేదు.
ట్యాంపరింగ్ ఈజీనా?
ఈవీఎంల తయారీ బాధ్యత బెల్, ఈసీఐఎల్ సంస్థలకు అప్పగించారు. వీటిలోని ఇండియన్ డెవలపర్స్, ఇంజినీర్లు, మెషీన్ల తయారీదారులు, ఈవీఎం విడిభాగాలను సరఫరా చేసే కంపెనీలు, మైక్రో చిప్లలోకి సాఫ్ట్వేర్ను చొప్పించే స్వదేశీ, విదేశీ నిపుణులు ఈ ప్రక్రియలో పనిచేసే సిబ్బందికి ఈవీఎంలను ఎప్పుడైనా ట్యాంపరింగ్ చేసే వెసులుబాటు ఉంటుందట. ఈవీఎంలను పూర్తిస్థాయిలో 2004లో వినియోగించారు. వీటి సగటు జీవిత కాలం 15 ఏండ్లు. అంటే ఈ లెక్కన 2004లో వినియోగించిన ఈవీఎంలు 2019 నాటికి పనిచేయకుండా మారిపోయాయి. తాజా గణాంకాల ప్రకారం ఈసీ దగ్గర 6.5 లక్షల ఈవీఎం, వీవీప్యాట్స్లలో లోపాలున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Also Read:గల్ఫ్ గోసకు చెక్.. అసలు సమస్యలేంటి..? పరిష్కారం ఎలా..?
ట్యాంపరింగ్ ఘటనలు!
హైదరాబాద్కు చెందిన ఎథికల్ హ్యాకింగ్ నిపుణుడు హరిప్రసాద్, అమెరికాకు చెందిన సైబర్ నిపుణుడు అలెక్స్, నెదర్లాండ్స్కు చెందిన మరో నిపుణుడు రోప్తో కలిసి 2009లో ఓ ఈవీఎంపై ప్రయోగాలు చేశారు. ఈవీఎంను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో ఓ వీడియోను తీసి తమ వెబ్సైట్లో పెట్టారు. అప్పట్లో ఇది వైరల్గా మారింది. అయితే, ట్యాంపరింగ్ ఎలా చేయగలిగారన్న విషయాలను పక్కనబెట్టిన అధికారులు ఈవీఎం ఎక్కడిదంటూ ప్రసాద్ను అరెస్టు చేసి ఆ తర్వాత విడిచిపెట్టారు. మధ్యప్రదేశ్లో 2017లో ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్ల అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఈవీఎంలో ఏ మీటా నొక్కినా వెలుపలికి వచ్చిన స్లిప్పులన్నీ బీజేపీ గుర్తువే ఉండటం కలకలం సృష్టించింది. దీంతో ట్యాంపరింగ్ చేయవచ్చని చెబుతూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు మే 2017లో ఢిల్లీ అసెంబ్లీలో ఓ ప్రదర్శన చేసి చూపించారు.
అగ్ర దేశాలే వద్దనుకుంటున్నాయి.. మనకెందుకు?
ఇప్పటివరకూ ఈవీఎంలను 31 దేశాలు వాడాయి. వీటిలో 30 దేశాలు ఈవీఎంల వాడకానికి పాక్షికంగా లేదా పూర్తిగా స్వస్తి పలికాయి. హ్యాకింగ్, ట్యాంపరింగ్, విశ్వసనీయత సమస్యలే దీనికి కారణం. భారత్లో తయారైన ఈవీఎంలను బోట్స్వానాలో వినియోగించగా, అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు రాబట్టేలా సిద్ధం చేశారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. ట్యాంపరింగ్ ఆరోపణలతో కజకిస్థాన్ 2011లో ఈవీఎంల వాడకాన్ని నిలిపివేసింది. ఇంటర్నెట్ ఓటింగ్తో ముప్పు ఉంటుందని ఫిన్లాండ్ ఈవీఎంల వాడకాన్ని నిషేధించింది. నెదర్లాండ్స్, రొమేనియా, కెనడా, ఐర్లాండ్, దక్షిణకొరియా, యూకే, స్కాట్లాండ్, బెల్జియం, సింగపూర్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్ సహా సాంకేతికతకు అడ్డాలుగా చెప్పుకొనే జపాన్, జర్మనీ కూడా ఈవీఎంల వినియోగంపై వెనక్కి తగ్గాయి. కానీ, మన దేశంలో వాటితోనే ఎన్నికలు కొనసాగుతున్నాయి. దీని వెనుక బీజేపీ కుట్ర ఉందనేది కాంగ్రెస్ నేతల వాదన. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని లేవనెత్తారు.