– రాష్ట్రంలో కరెంట్ కోత ఉండొద్దు
– తాగునీటి కొరతను అధిగమించాలి
– వేసవికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలి
– అధికారులకు ముఖ్యమంత్రి అత్యవసర ఆదేశాలు
– సచివాలయంలో కీలక సమీక్ష
– రాష్ట్రంలో నిరంతర విద్యుత్
– గత రికార్డుల్ని చెరిపివేయడంపై హర్షం
CM Revanth Reddy Ordered The Officials: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్తు శాఖ, వేసవిలో తాగునీటి అవసరాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు సీఎం. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. బోర్ వెల్స్, బావులన్నింటినీ తాగునీటి అవసరాలకు వాడుకోవాలని, సమీపంలో ఉన్న నీటి వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాగు నీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సమస్య ఉన్న చోట తక్షణ పరిష్కారాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆదేశించారు. వేసవి కోసం ప్రత్యేకంగా గ్రామాల వారీగా డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని చెప్పారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర స్థాయి నుంచి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలలో తాగునీటి కొరతను అధిగమించేందుకు వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ట్యాంకర్లు బుక్ చేస్తే ఆలస్యం లేకుండా 12 గంటల్లోపు అవసరమైన చోటికి చేరేలా చూడాలని, అందుకు సరిపడా ట్యాంకర్లు సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో బ్రేక్ లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. అందుకు సరిపడా అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. డిమాండ్కు సరిపడేంత విద్యుత్ అందుబాటులో ఉందని, కరెంట్ పోయిందనే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని సూచించారు సీఎం. రోజురోజుకు ఎండలు మండుతుండటం విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కరెంట్ లభ్యత, తక్షణ అవసరాలపై ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. గత ఏడాది కంటే రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్ను సరఫరా చేయడంతో కొత్త రికార్డు నమోదైందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలో డిమాండ్ గణనీయంగా పెరిగిందని, పీక్ డిమాండ్ ఉన్నప్పటికీ కోత లేకుండా అందించటంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కని ఈ సందర్భంగా అభినందించారు రేవంత్ రెడ్డి.
Read Also: ట్యాపింగ్ వేటు, తిరపతన్న, భుజంగరావు సస్పెండ్
గత ఏడాదితో పోలిస్తే డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సగటున 9712 మెగావాట్ల విద్యుత్తు లోడ్ ఉంటుంది. గత రెండు వారాలుగా 14,000 మెగా వాట్ల నుంచి 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటోంది. ఏప్రిల్ నెల రెండో వారం వరకు ఇంచుమించుగా ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుందని విద్యుత్ అధికారులు అంచనా వేశారు. వేసవి అవసరాలకు అనుగుణంగా సరఫరా చేసే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా, పంటలు ఎండిపోకుండా, పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పారు.
గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయింది. 2024 జనవరి నుంచి మార్చి వరకు రోజుకు సగటున 251.59 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగింది. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్లు అత్యధిక రికార్డు కాగా ఈ ఏడాది 308.54 మిలియన్ యూనిట్లతో కొత్త రికార్డు నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ గత ఏడాదితో పోలిస్తే కరెంట్ సరఫరా మెరుగుపడింది.
పూర్తి కథనం…